Top Stories

హైదరాబాద్‌లో భారీ వర్షం..ఐఎండీ అలర్ట్ ప్రకటన

  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తన్నారు.  మండు వేసవిలో ఉక్కపోతలో ఇబ్బంది పడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.  కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు  జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.  రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  మరోవైపు వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బుధవారం తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది
హైదరాబాద్‌లో భారీ వర్షం..ఐఎండీ అలర్ట్ ప్రకటన Publish Date: May 21, 2025 3:21PM

విచారణకు కేసీఆర్ రెఢీ?!

కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ..  అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. అయితే.. ఇప్పడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతితో పాటుగా, నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌   (కాళేశ్వరం కమిషన్‌) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదే విధంగా నీటి పారుదల శాఖ మాజీ  మంత్రి హరీశ్‌రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు జారీచేసింది. జూన్‌ 6న హరీశ్‌రావు, అదే నెల 9న ఈటల రాజేందర్‌ ను విచారణకు హాజరుకావాలని కోరింది.  ఇప్పడు.. ఈ పిలుపు సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌  విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే.. ,అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరవుతారా? లేక న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అనేది కీలకంగా మారుతోంది. ఒక విధంగా  ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.  అయితే..  అధికారికంగా బీఆర్ఎస్  నుంచి ఎలాంటి ప్రకటన లేక పోయినా..  కేసీఆర్ విచారణకు హాజరు అవుతారనే బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై రాజకీయ పోరాటానికి దీన్నొక అవకాశంగా తీసుకునే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో అన్ని కోణాల్లో చర్చించి, ముఖ్యంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలని  ‘ఫార్మ్’ హౌస్ నిర్ణయనికి వచ్చినట్లు చెపుతున్నారు.  ఈ నేపథ్యంలో కమిషన్  విచారణకు హాజరు కావడం వలన చట్టపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటుగా రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయంతీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. కేసీఆర్  విచారణకు హరరైనా కాకున్నా, కమిషన్ ఇచ్చే నివేదికలో మార్పు ఏమీ ఉండదు. నిజానికి, రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా నివేదిక ఇప్పటికే  సిద్దమైందని అంటున్నారు.  కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. మరో వంక విచారణకు హాజరు కాకపోతే..  తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనీ,  అలాగే  రాజకీయ బురద చల్లేందుకు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరు కావడమే ఉత్తమమని బీఆర్ఎస్  ముఖ్య నాయకులు, ముఖ్య సలహాదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి  ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు..  తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? అంటూ  సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు గతంలో ఫార్ముల ఈ కేసులో కేటీఆర్  ఏసీబీ విచారణ తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పడు కేసీఆర్ కూడా అదే బాటలో నడిస్తే మరింత అభాసుపాలు కావాల్సి వస్తుందనీ..   సో  విచారణను ఒక  అవకాశంగా మల్చు కుని రేవంత్ రెడ్డి చరిత్రను,  కాంగ్రెస్ చరిత్రను ఎండకట్టవచ్చని అంటున్నారు. అలాగే కాళేశ్వరం ఎపిసోడ్ మొత్తం రాజకీయ డ్రామాగానే చూడాలనీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు ఇదొక మచ్చుతునక, తప్ప మరొకటి కాదని  పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.  మరోవంక కొంత వరకు స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ లో సెంటిమెంట్ రగిల్చేందుకు ఇదొక అస్త్రంగా పనిచేస్తుందనిరాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  ఓడిపోయినా..  కేసీఆర్ పట్ల ఇటు ప్రజల్లో అటు పార్టీ క్యాడర్ లో అంతగా వ్యతిరేకత లేదని అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్  లో అవినీతి జరిగినా.. తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైన నీళ్ళు, నియామకాలు, నిధుల్లో.. మొదటిదైన నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటుగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో పాస్ మార్కులు కాదు, ఫస్ట్ క్లాసు మార్కులే తెచ్చుకుందని పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో కానీ,  కాళేశ్వరం కమిషన్  కేసీఆర్ ను విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
 విచారణకు కేసీఆర్ రెఢీ?! Publish Date: May 21, 2025 3:15PM

కుంకీ ఏనుగుల ప్ర‌త్యే‘క‌థ‌’ ఏమిటో తెలుసా?

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు రైతుల క‌ష్టాల‌కు కుంకీల‌తో చెక్ ఇంత‌కీ ఏమిటీ కుంకీ ఏనుగుల ప్ర‌త్యేక‌త‌!  మే 21న ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు రానున్నాయి. బెంగ‌ళూరులోని విధాన సౌధ లో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌. డీసీఎం డీకే శివ‌కుమార్, ఏపీ డిప్యూటీసీఎం ప‌వ‌న్ కళ్యాణ్ స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. గ‌తేడాది ఆగ‌స్టులో త‌మ‌కు కుంకీ ఏనుగులు కావాల‌ని కోరారు అట‌వీ శాఖా మంత్రి కూడా అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్. దీంతో సిద్ధ‌రామ‌య్య స‌ర్కార్ వీటిని ఏపీకి అందించ‌డానికి సిద్ధ‌మైంది. రైతుల పంట పొలాల‌ను నాశ‌నం చేస్తున్న అడవి ఏనుగుల‌ను అదుపు చేసేందుకు ఈ కుంకీ ఏనుగుల‌ను వాడుతారు. కుమ్కీ, కూమ్కీ, కూంకీ, కుంకి అని పిలుస్తారీ ఏనుగుల‌ను. మ‌ల‌యాళీలైతే.. త‌ప్పాన అని కూడా పిలుస్తారు.  భార‌త్ లో అడ‌వీ ఏనుగుల‌ను బంధించ‌డానికి ఆప‌రేష‌న్ల‌లో ఉప‌యోగించే ట్రైనప్ అయిన ఏనుగుల‌ను ఈ ఈ పేర్ల‌తో పిలుస్తారు.  కొన్ని సార్లు గాయ‌ప‌డ్డ అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించ‌డానికి, ఏదైనా ఉచ్చులో చిక్కిన అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించి.. వైద్య ప‌రీక్ష‌లు అందించ‌డానికి కూడా ఈ ఏనుగులను ఉపయోగిస్తారు.  అడ‌వి ఏనుగుల‌ను బంధించ‌డానికి, శాంతింప చేయ‌డానికి, మంద‌ను మేప‌డానికి, సంఘ‌ర్ష‌ణాత్మ‌క ప‌రిస్థితుల్లో అడ‌విలోంచి వ‌చ్చిన ఏనుగుల‌ను తిరిగి అడ‌విలోకే పంప‌డానికీ..కుంకీ ఏనుగుల‌ను ఒక అంకుశంలా వాడుతారు.  బేసిగ్గా ఏనుగును మావటి అంకుశం ద్వారా కంట్రోల్ చేస్తాడు. అవి మావ‌టి ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొంది ఉంటాయి కాబ‌ట్టి అత‌డి అంకుశానికి అవి లోబ‌డి ప్ర‌వ‌ర్తిస్తాయి. అదే అడ‌వి ఏనుగులు అలాక్కాదు. అవి ఎవ‌రి మాట విన‌వు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వ‌జ్రాన్ని వ‌జ్రంతోనే కోయాల‌న్న‌ట్టు.. అలాంటి ఏనుగుల‌ను.. సాటి ఏనుగుతోనే కంట్రోల్ చేయ‌డాన్నే కుంకీ ఏనుగు అంటారు. వీటికంటూ ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉంటుంది. బేసిగ్గా భార‌త‌దేశంలో ఏనుగుల‌ను ఆల‌యాల్లో దైవ సేవ‌ల కార్య‌క్ర‌మాల‌కే ఎక్కువ‌గా వినియోగిస్తారు. త‌ర్వాత స‌ర్క‌స్ లో ఎక్కువ‌గా వాడుతారు. కానీ కుంకీ ఏనుగుల రూటే స‌ప‌రేటు. వీటిని సైనికుల్లా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎదుర్కోబోయేది మ‌నుషుల‌ను కాదు సాటి ఏనుగుల‌ను. అస‌లే అడ‌వి ఏనుగులు మ‌ద‌మెక్కి ఉంటాయి. ఆ గ‌జ‌బ‌లాన్ని ఢీకొట్టాలంటే అందుకు త‌గిన విధంగా.. ఈ ఏనుగు సైతం అంతే ధీటుగా ఉండాలి. ఆ దిశ‌గా వీటిని తీర్చిదిద్దుతారు. అడ‌వి ఏనుగులు జ‌నావాసాల్లోకి, వారి పంట పొలాల్లోకి ప్రవేశించిన‌పుడు.. వాటిని త‌ర‌మికొట్ట‌డానికి కుంకీల‌ను వాడుతారు. అడ‌వి ఏనుగుల‌కు కుంకీ ఏనుగుకు మ‌ధ్య ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేక పోయినా.. ఆ ఏగుల అరుపుల‌తో కూడిన‌ భాష‌ను ఈ ఏనుగు ఇట్టే ప‌సిగ‌ట్టి వాటికి త‌న మావ‌టి ఇచ్చే హెచ్చ‌రిక‌లను జారీ చేసి.. పొలాల్లోకి రాకుండా  చేస్తుంది. కొన్ని ఏనుగులు త‌మ మావ‌టి నుంచి వ‌చ్చే పాదాల ఆదేశాల‌ను అనుస‌రించి.. మొత్తం ఆప‌రేష‌న్లో నిశ్శ‌బ్ధంగానే ఉంటూ అడవి ఏనుగుల‌ను త‌రిమికొట్టేలా ట్రైనింగ్ ఇస్తారు.. కుంకీ అనే ప‌దం ప‌ర్షియ‌న్ భాష‌లోని కుమాక్ నుంచి వ‌చ్చిన‌ట్టు చెబుతారు. దీన‌ర్ధం స‌హాయం అని. బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కూ ఈ ప‌దాన్నే ఎక్కువ‌గా వాడుతున్నారు. 2012లో త‌మిళంలో కుంకీ అనే సినిమా కూడా  వ‌చ్చింది. సాలోమ‌న్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో.. విక్రం ప్ర‌భు, ల‌క్ష్మి మీన‌న్ హీరో హీరోయిన్లుగా.. తిరుప‌తి బ్ర‌ద‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం 5 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. మొత్తం 70 కోట్ల మేర వ‌సూలు చేసిన సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడీ సినిమా  ప్ర‌స్తావ‌న ఎందుకంటే.. ఈ మూవీగానీ మీరుచూడ‌గ‌లిగితే.. కుంకీ ఏనుగుల మీద పూర్తి అవ‌గాహ‌న క‌లుగుతుంది.
కుంకీ ఏనుగుల ప్ర‌త్యే‘క‌థ‌’ ఏమిటో తెలుసా? Publish Date: May 21, 2025 2:52PM

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

  తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ షోకాజ్ నోటీసులు పంపించారు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై సునీతా రావు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబ నోటీసులు జారీ చేశారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు గాంధీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం మహిళా కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమించిందని.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్‌కు అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎన్నిసార్లు కలిసినా సీఎం రేవంత్‌రెడ్డిని కలవండి అని చెబుతున్నారని సునీతా రావు వాపోయింది. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని ఆమె అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు సునీతా రావు ప్రశ్నించింది. బీఆర్ఎస్,  బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని ఆమె తెలిపింది  
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే? Publish Date: May 21, 2025 2:35PM

కేశినేని నాని హడావుడి.. తన కోసమా? కుమార్తె ఫ్యూచర్ కోసమా?

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారట. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని తమ్ముడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతేడాది జూన్ 10న ఇక రాజకీయాల్లోకి వచ్చేదే లేదని చెప్పారు. కానీ ఇప్పుడదే కేశినేని నాని బీజేపీ నాయకులతో రాజకీయ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది. కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె కూడా విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా?  కూతురు రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేశినేని నాని, 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత తెలుగుదేశంలో రెబల్ అవతారం ఎత్తారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహారశైలి కొనసాగింది. 2023  విజయవాడ ఎంపీ టికెట్‌ని.. ఆయన తమ్ముడు చిన్నికి ఖరారు చేయడంతో, నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఎన్నికల్లో మాత్రం తమ్ముడిపై గెలవలేకపోయారు. అప్పట్నుంచి పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరమై, పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయ్యాక, మళ్లీ ఈ మధ్య కాలంలో కేశినేని నాని తరచు వార్తల్లో నానుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు, ఎంపీ కేశినేని చిన్నిపై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే, రాజకీయ విమర్శలు చేస్తూ, తాను రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. బ్యాక్ ఎండ్‌లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. చిన్ని టార్గెట్‌గా విమర్శలు చేస్తూ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతూ, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇదంతా మళ్లీ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకే అంటున్నారు. నిజంగానే కేశినేని నాని.. పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? లేక.. తమ్ముడి మీద ఆరోపణలతోనే ఆగిపోతారా? .. అన్నది చూడాలి.
కేశినేని నాని హడావుడి.. తన కోసమా? కుమార్తె ఫ్యూచర్ కోసమా? Publish Date: May 21, 2025 2:18PM

మావో సుప్రీం కమాండర్.. అలిపిరి దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో హతం

ఛత్తీస్ గఢ్ లో బుధవారం (మే 21) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి సూత్రధారి నంబాల కేశవరావు  అలియాస్ గగన్నా కూడా ఉన్నారు. 2012లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మెరుపుదాడిలోనూ నంబాల కేశవరావుదే ప్రధాన పాత్ర.  మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 పార్టీకి సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావు  గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట అని చెబుతారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేశాడు నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజం పట్ల  ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు. శ్రీకాకుళం జిల్లా జియన్న పేట నంబాల కేశవరావు స్వస్థలం. ఈయన 1955లో జన్మించిన ఆయన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మునుపటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్ పూర్తి చేశారు. 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.  2004లో పీపుల్స్ వార్  మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం మాజీ యోధుల దగ్గర శిక్షణ పొందారు. నంబాల కేశవరావు  మావోయిస్టులు జరిపిన పలు దాడులలో కీలక పాత్ర పోషించారు.  2010లో దంతేవాడలో 76 సీఆర్‌పీఎప్ జవాన్లు హతమైన దాడిలో నంబాల కేశవరావుదే కీలక పాత్ర.   ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా ఉన్న నంబాల కేశవరావు బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. నంబాల కేశవరావుపై రూ. కోటీ  30 లక్షల రివార్డు ఉంది. నంబాల కేశవరావు మృతి మావోయిస్టులకు తేరుకోలేని ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.  
మావో సుప్రీం కమాండర్.. అలిపిరి దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో హతం Publish Date: May 21, 2025 2:00PM

వైసీపీ నేతల కాషాయ జపం.. జగన్ స్టాండ్ మారుతోందా?

ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీలో నేతల అంతర్గత విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.  వై నాట్‌ 175 అంటూ హడావుడి చేసిన జగన్ పార్టీని ప్రజలు ఛీత్కరించారు. దాంతో పార్టీ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నాయకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ చేసిన పెద్ద తప్పని నల్లపురెడ్డి కుండబద్దలు కొట్టేశారు. మనసులో మాటని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన నల్లపురెడ్డి, ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. దాంతోఈ వ్యవహారంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దతిచ్చినట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. గడిచిన ఐదేళ్లు పార్లమెంట్‌లో కేంద్రానికి అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీకి దూరమైంది. 2024 ఎన్నికల సమయంలోనూ బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ, ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్పు ఏముందనే చర్చ కూడా నడిచింది. అయితే పొత్తు విషయంలో వైసీపీ వైపు నుంచి అడుగులు పడకపోవడంతో బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు.  గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ పెద్దలు కూడా బీజేపీతో  ఢిల్లీ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగించారు. ఎప్పుడూ బీజేపీ విధానాలను కానీ.. ఆ పార్టీ పెద్దలపై కానీ ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల గడువుంది. ఉన్నట్టుండి.. బీజేపీతో పొత్తు అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? అనే చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేతలు తరచుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బీజేపీ బయటకు వచ్చే పరిస్ధితులు లేవు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన బంధం మరింత బలపడింది. ఈ తరుణంలో వైసీపీ నేతలు బీజేపీతో పొత్తు అంశాన్ని మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని గ్రహించే ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై పార్టీ స్టాండ్ ఎంటనేది ఇంకా ప్రకటించినప్పటికీ, ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసే, బీజేపీతో కలిసి వెళితే లాభం ఉంటుందని ఆయన మాట్లాడి ఉంటారని, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అంటున్నారు. అయితే.. వైసీపీతో కలవాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సింది మాత్రం కేంద్ర నాయకత్వమే అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ మాత్రం ఓ అడుగు ముందుకేసి బీజేపీ, వైసీపీ ఉత్తర, దక్షిణ ధృవాలని, భవిష్యత్‌లో అవి కలిసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల కాషాయ జపం.. జగన్ స్టాండ్ మారుతోందా? Publish Date: May 21, 2025 1:03PM

పల్లా శ్రీనివాసరావుకు లోకేష్ క్లాస్.. ఎందుకో తెలుసా?

ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు. ఎందుకంటే.. సోమవారం (మే 19)న  గ్రేటర్ విశాఖ మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా వాయిదా పడింది. అలా వాయిదా పడటానికి కారణం కొందరు తెలుగుదేశం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే. అసలు విషయమేంటంటే... వైసీపీ జమానాలో జరిగిన  జీవీఎంసీ ఎన్నికల్లో  మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీయే దక్కించుకుంది.  అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది.  ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలలో వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆ పార్టీని వీడి కూటమి పార్టీల పంచన చేరారు. వారిలో అత్యధికులు తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో జీవీఎంసీపై తెలుగుదేశం పట్టు సాధించింది.  జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం (మే 19) ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పలువురు తెలుగుదేశం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.   జీవీఎంసీలో కూటమికి దాదాపుగా 74 మందికి కార్పొరేటర్ల బలం ఉంది.   56 మంది  హాజరైతే డిప్యూటీ మేయర్ సజావుగా సాగి ఉండేది. కానీ  కేవలం 54 మంది   మాత్రమే హాజరుకావడంతో కోరం లేక  ఎన్నిక  వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అదికారి ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న  ఇలా డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందో, లేదో… ఆ సమాచారం   నారా లోకేశ్  పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితోనే పలువురు గైర్హాజరయ్యారని తెలుసుకున్న ఆయన గైర్హాజరైన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పొత్తులో  మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేననీ, భవిష్యత్ లో మళ్లీ ఇటువంటి సంఘటన పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ పల్లాకు క్లాస్ పీకారట.  
పల్లా శ్రీనివాసరావుకు లోకేష్ క్లాస్.. ఎందుకో తెలుసా? Publish Date: May 21, 2025 11:40AM

ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పిలోరాగఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 180 మంది కైలాస్ మానసనరోవర్ యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రోడ్డు క్లియర్ చేయడానికి బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు క్లియర్ చేస్తున్నారు.  కరోనా  మహమ్మారి కారణంగా 2020లో కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. ఆ తరువాత కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో అప్పటి నుంచి ఈ యాత్ర జరగడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్యా జరిగిన చర్చలు ఫలించడంతో ఐదేళ్ల తరువాత ఈ ఏడాది కేలాస మనస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించారు.  
ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు Publish Date: May 21, 2025 11:20AM

ఛత్తీస్గఢ్ మరో భారీ ఎన్కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి!

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలలో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్ కగార్ కు కామా పెట్టిన కేంద్రం.. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతలు ఒకింత సడలగానే మళ్లీ వేగం పెంచింది. తాజాగా బుధవారం (మే 21) ఉదయం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో20 మంది నక్సలైట్లు మరణించారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు మరణించినట్లు చెబుతున్నారు.  సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. 
 ఛత్తీస్గఢ్ మరో భారీ ఎన్కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి! Publish Date: May 21, 2025 10:53AM

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ దర్యాప్తు.. ఇట్స్ కన్ ఫర్మ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇక ఈడీ అంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాంచి దూకుడుమీద ఉంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. వాస్తవానికి గతంలోనే ఈడీ ఈ కేసును టేకప్ చేయడానికి కోర్టును అభ్యర్థించినా ఇంత వరకూ అనుమతి రాలేదు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్నఆరోపణలు ఉండటంతో ఈ కేసు ఈడీ టేకప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కింగ్ పిన్ గా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతించాల్సిందిగా ఈడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను గతంలోనే విచారించిన కోర్టు అప్పట్లో తీర్పు వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా ఈడీకి రాజ్ కేశిరెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేయడానికి అనుమతి ఇస్తూ మంగళవారం (మే 20) తీర్పు వెలువరించింది.   దీంతో రాజ్  కేసిరెడ్డిని ఈడీ విచారించేందుకు సన్నద్ధమౌతున్నది. ఏసీబీ, సీఐడీడ కేసులు, దర్యాప్తులతో పోలిస్తే ఈడీ తీరు భిన్నంగా ఉంటుంది. ఈడీ కేసు నమోదు చేసిందంటే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిందితులే నిరూపించుకోవలసి ఉంటుంది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి బ్రేక్ డౌన్ అయిపోయారనీ, అప్రూవర్ గా మారేందుకు రెడీ అయిపోయారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడమంటే.. ఈ కేసులో నిందితులందరికీ ఉచ్చు గట్టిగానే బిగిసిందని పరిశీలకులు అంటున్నారు.   
ఏపీ మద్యం కుంభకోణం కేసు ఈడీ దర్యాప్తు.. ఇట్స్ కన్ ఫర్మ్ Publish Date: May 21, 2025 10:27AM

వైసీపీ వీఐపీలతో కిక్కిరిసిపోయిన విజయవాడ జిల్లా జైలు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి గత ఎన్నికలలో అంటే 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత... కొంత కాలం రాష్ట్ర ప్రగతి, సంక్షేమం వినా మరే రాజకీయ కార్యక్రమం చేపట్టిన సర్కార్ ఇప్పుడు.. జగన్ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎక్కడా కక్ష సాధింపు ధోరణి కనిపించడం లేదు. చేసిన తప్పులకు, నేరాలకు చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణలు జరిపి కోర్టుల ద్వారానే శిక్ష పడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉంది. రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ కూడా తెలుగుదేశం, జనసేన శ్రేణులు జగన్ హయాంలో చెలరేగిపోయి, ఇష్టారీతిగా, తాము చట్టాలకు అతీతులమన్నట్లుగా వ్యవహరించిన వారిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ వచ్చాయి. వస్తున్నాయి. ఒక దశలో ప్రభుత్వం గత పాలనలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమార్జనకు పాల్పడిన వారి పట్ల చంద్రబాబు సర్కార్ మెతకగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్త మయ్యాయి. అయితే సర్కార్ మాత్రం ఎక్కడా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చట్ట ప్రకారమే శిక్షలు, చర్యలు అంటూ వస్తున్నది. ఇప్పుడు అంటే ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండగా.. వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అది కూడా వారి నేరాలకు సంబంధించి పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలూ సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతోంది. అందులో బాగంగానే  జగన్ హయాంలో వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండతో నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చెలరేగిపోయిన అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కాంల గుట్టు కూడా బయటపడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో పలు అరెస్టులు జరుగుతున్నాయి. అలా అరెస్టైన వారంతా ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అరెస్టైన వారిలో పలువురు వైసీపీ వీఐపీలు కూడా ఉండటంతో... నెటిజనులు వైసీపీ వీఐపీలకు విజయవాడ జైలు అడ్డాగా మారిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. అరెస్టైన వారు సరే వారిని ములాఖత్ ద్వారా కలవడానికి కూడా వైసీపీ నేతలు క్యూకడుతుండటం వైసీపీలో వెల్లువెత్తతున్న ఆందోళనకు అద్దం పడుతోంది.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు   వల్లభనేని వంశీ మూడు నెలలుగా విజ యవాడ జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులు రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్, మాజీ సీఎం జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి,  భారతీ సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించే గోవిందప్ప బాలాజీ కూడా విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య కూడా ఇదే జైలులో  ఊచలు లెక్కిస్తున్నారు. ఇంత మంది వైసీసీలో కీలకంగా వ్యవహరించిన,వ్యవహరిస్తున్న వారు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తుండటం, వీరిని కలిసేందుకు ములాఖత్ ల కోసం మరింత మంది క్యూ కడుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ జిల్లా జైలు పేరు మార్మోగిపోతున్నది.  
వైసీపీ వీఐపీలతో కిక్కిరిసిపోయిన విజయవాడ జిల్లా జైలు Publish Date: May 21, 2025 9:53AM

పసుపు కొమ్ము ఆరోగ్య రహస్యం!

  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పసుపు కొమ్ము ఆరోగ్య రహస్యం! Publish Date: May 21, 2025 9:30AM

మంచి నిద్రకు అద్భుతమైన మందు!

ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  
మంచి నిద్రకు అద్భుతమైన మందు! Publish Date: May 21, 2025 9:30AM

బీహార్ ఎన్నికలు.. పీకే కు పరీక్ష.. రాగాకు అగ్ని పరీక్ష!

బీహార్ శాసనసభ ఎన్నికలు వేగంగా కదులుతున్న ఋతుపవనాలను మించిన  వేగంగా తరుము కొస్తున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ సహజంగానే రాజకీయ వేడి పెరుగుతోంది. నిజానికి  ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  కేవలం బీహార్ కు మాత్రమే పరిమితమైన ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయ గతిని మార్చివేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా ఇంచుమించుగా ఒకదశాబ్ద కాలానికి పైగా దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్   స్థాపించిన జన సురాజ్ పార్టీ  కి పరీక్షగా నిలిచే ఈ ఎన్నికలు, కులగణనను రాజకీయ తారక మంత్రాన్ని నమ్ముకున్న  రాహుల్ గాంధీకి అగ్ని పరీక్షగా నిలుస్తాయని అంటున్నారు.  వివరాల్లోకి వెళితే ..  బీహార్ శాసన సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఈ సంవత్సరం చివర్లో, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికల జరగనున్న రాష్ట్రంలో అధికారాన్ని నిలుపునేందుకు బీజేపీ సారథ్యంలో ఎన్డీఎ కూటమి, అధికారాన్ని  హస్తగతం చేసుకునేందుకు  కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. మరో వంక  ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్’ స్థాపించిన  జన సురాజ్ పార్టీ తొలి సారిగా ఎన్నికల బరిలో దిగుతోంది. సో , ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఎన్నికల పాఠాలు చెప్పిన ప్రశాంత్ కిశోర్ కు ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అదలా ఉంటే..  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  పదే పదే వల్లె వేస్తున్న,కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి తారక మంత్రంగా భావిస్తున్న కులగణన ప్రభావం జాతీయ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది అనేది కూడా  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కావడంతో  దేశ భవిష్యత్  రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా  భారత్, పాకిస్థాన్  మధ్య కుదిరిన కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ ఖాతాలో వేసుకున్నట్లుగా,కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న రాహుల్ గాంధీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్ష కాగలవని పరిశీలకులు అంటున్నారు. కాగా.. జన్‌సురాజ్ పార్టీ గత ఏడాది నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.  నాలుగు  స్థానాలలోనూ ఓడి పోయింది. అంతే కాదు ఒక్క సీటు మినహా మిగిలిన మూడు నియోజక వర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. అయితే తొలి ప్రయత్నంలోనే పది శాతం ఓట్లు తెచ్చుకుంది. జన సురాజ్  పది శాతం ఓట్లు పట్టుకు పోవడం కమలానికి కలిసోచ్చింది. బీజేపీ తమ సిట్టింగ్ సీటు (ఇమామ్‌గంజ్)తో పాటుగా   ఇండియా కూటమి మూడు సిట్టింగ్ స్థానాలు (తరారి, రామ్‌గఢ్, బెలగంజ్) మొత్తం నాలుగు స్థానాలను గెలుచుకుంది. సో.. ఇదే లెక్క రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేస్తే..  ఎన్డీఎ గెలుపు మరింత సులువు అవుతుంది. అంతకంటే ముఖ్యంగా  రాహుల్  గాంధీ రాజకీయ భవిష్యత్   ప్రశ్నార్ధకగా  మారుతుందని అంటున్నారు.   అదలా ఉంటే, గత ఏడాది (2024) అక్టోబర్ 2న  జన్  సురాజ్  పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ఒంటి చేతితో నడిపించారు. అయితే..  ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ,  భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. అంతే కాదు  పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు. దీంతో పీకే వ్యూహం ఏమిటి?  అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  ఎన్నికల ప్రకటన వెలువడితే గానీ, అసలు చిత్రం తెర పైకి రాదని అంటున్నారు.
బీహార్ ఎన్నికలు.. పీకే కు పరీక్ష.. రాగాకు అగ్ని పరీక్ష! Publish Date: May 21, 2025 9:23AM

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ భేటీ

  ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్‌ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.  రానున్న రోజుల్లో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ఆసక్తి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఏర్పాటు చేసిన బ్లాక్స్ ఆకట్టుకున్నాయిని మంత్రి తెలిపారు . జీవితం పట్ల వారికున్న క్లారిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు కంటున్న కలలు అన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం పెరిగేందుకు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయిని లోకేశ్ పేర్కొన్నారు
పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ భేటీ Publish Date: May 20, 2025 9:43PM

ఏపీలో రేషన్ వ్యాన్ల రద్దు : మంత్రి నాదెండ్ల

  ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని  మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 29వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేది. గత వైసీపీ సర్కార్ ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ల కోసం  రూ.1860 కోట్లు వృథా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారు. 30శాతం మందికి రేషన్‌ అందడం లేదని ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తేలింది.  రేషన్‌ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీ తనం లేదు, సరకులు ఎటు వెళ్తున్నాయో తెలియదు.  వందల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు ఈ వాహనాల ఆపరేటర్‌లపై నమోదయ్యాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకున్నారు. చౌకదుకాణాలు ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతాం అని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాకా సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియలేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేల చొప్పున పౌర సరఫరా శాఖ చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా అంశాలపై నిర్ణయించి రేషన్ వ్యాన్లను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీపం-2 పథకం పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని.. దీపం-2 కింద బుకింగ్ కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.     
ఏపీలో రేషన్ వ్యాన్ల రద్దు : మంత్రి నాదెండ్ల Publish Date: May 20, 2025 8:43PM

రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

  రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపడం తద్వారా కళలకు కాణాచి, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరానికి పునఃవైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చట్టం - 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఏపీలోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు.    తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుందని తెలిపారు. అన్ని భాషలను గౌరవిస్తూనే మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలన్న  లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్ర లేఖనం తదితర వాటిలో  అధునాతన అధ్యయానికి, పరిశోధనలు సులభతరం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భవిష్యత్ లో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు పరిశోధనలకు అవకాశం కల్పించబడుతుందన్నారు. అంతేగాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, సంస్కృతి, శాస్త్రాలు సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున  సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తూ పవిత్ర గోదావరి చెంతన ఉన్న  రాజమహేంద్రవరంలో తెలుగు వైభవంగా వెలుగొందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషా సంస్కృతులు, కళలు మరింతగా విరాజిల్లుతాయన్న అభిప్రాయాన్ని మంత్రి దుర్గేష్ వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో తెలుగు యూనివర్సిటీ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం Publish Date: May 20, 2025 8:05PM

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

  తిరుమల తిరుపతి దేవస్థాన మండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది.  స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు.  తిరుమల ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. టీటీడీ ఉప ఆలయాలు సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆకాశగంగ, పాపవినాశం, కాలినడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.⁠  తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌ స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.  ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామని ఈవో వెల్ల డించారు. ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ⁠టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్థుల బదిలీలు.. వీర్ఎస్ దిశగా కసరత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.   
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే Publish Date: May 20, 2025 7:18PM

రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పణ

  ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.  అనంతరం సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు.  ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్‌ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం అమరావతి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు అమరావతికి తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.   
రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు  సమర్పణ Publish Date: May 20, 2025 6:33PM

మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు

జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.  ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీఈ కమిటీలే చూసుకుంటాయి. మొత్తంగా మహానాడుకు సంబంధించి సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటారు. నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ  రామ్మోహన్‌నాయుడు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 19 కమిటీలకు సంబంధించి ఒక్కో కమిటీలో పది నుంచి 20 మంది ఉంటారు.   పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడి నేతృత్వంలో వసతి  , రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే విధంగా కడపలో మహానాడు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక మహానాడులో తొలి రోజు అంటే మే 27న  పార్టీ అధినేత ఎన్నిక కోసం చంద్రబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు పార్టీ చంద్రబాబును పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. అలాగే రెండో రోజు వివిధ అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతుంది. చివరి రోజు పార్టీ పలు తిర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది.  
మహానాడు నిర్వహణ కోసం 19 కమిటీలు Publish Date: May 20, 2025 4:37PM

రైతు సమస్యలపై ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.  మరోవైపు రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పంటల దిగుబడులపై సీఎంకు అధికారులకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. లిక్కర్ స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ▪️2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. ▪️హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం. ▪️విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి. ▪️అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. ▪️దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ. ▪️భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం. ▪️ఏపీ లెదర్ పుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం. ▪️పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం. ▪️రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు.
రైతు సమస్యలపై ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయం Publish Date: May 20, 2025 4:34PM

భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత  ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాక్ భారత్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటం, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఒకింత సడలినా..  పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ వ్యూహాత్మకంగా  పాకిస్థాన్ పై దౌత్యయుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే..  పహల్గాం ఉగ్రవాదికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదననంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది.   ఈ ఏడు ప్రతినిథి బృందాలకు అఖిల పక్షాలకు చెందిన నేతలు నాయకత్వం వహిస్తారు. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. అలాగే మిగిలిన ఆరు బృందాలకూ.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, అదే పార్టీకి చెందిన వైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా,  డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎంపీ శ్రీకాంత్  నాయకత్వం వహిస్తారు. కాగా ఈ బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలకు కూడా స్థానం దక్కింది.   రాజమహేంద్రవరంఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రవిశంక్ ప్రసాద్ నేతృత్వం వహించే బృందంలో సభ్యురాలు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లలో పర్యటిస్తుంది. అలాగే... ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలె నాయకత్వంలోని బృం దంలో  నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం నాయకుడు లావు కృష్ణదేవరాయులు సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, క్వటార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది. ఇక శశిథరూర్ నేతృత్వం వహించే బృందంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటిస్తుంది.  
భారత దౌత్య బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలు Publish Date: May 20, 2025 3:57PM

దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన

  దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్  దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్‌-1, ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కరోనా కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్  స్పందించి, ఈ వార్తలను ఖండించింది.  సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించిన మాట వాస్తవమే అయినా, వారి మృతికి కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. తాజాగా కోవిడ్ భారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్ర అలసటతో బాధపడుతున్నారు. వర్షాకాలం వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు.  ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.   
దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన Publish Date: May 20, 2025 3:46PM

వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్లపై  విచారణను ఏపీ హైకోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం పోలీసుల పీటీ వారెంట్  పై వంశీ హౌస్ మోషన్ పిటిషన్   దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్   మంజూరు చేయాలని  ఆ పిటిషన్ లో కోరారు. అయితే వంశీ బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం ( మే 22)కు వాయిదా వేసింది.  ఇక పోతే బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈ సాయంత్రం వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.  ఇలా ఉండగా.. అక్రమ మైనింగ్ కేసులో కింది కోర్టు అనుమతించినా గురువారం వరకూ పీటీ వారంట్ జారీ చేయబోమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏది ఏమైనా బెయిలు విషయంలో వల్లభనేని వంశికి మరోసారి చుక్కెదురైంది. 
వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా Publish Date: May 20, 2025 3:19PM

కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివర్శిటీలో  జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. గ్రాడ్యుయేష‌న్ కు సంబంధించిన ఫోటోను  కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఈ గోప్ప ప్రయాణంలో నీవు చాలా కష్టపడ్డావు. ఎంతగానో ఎదిగావు, మమ్మల్ని గర్వపడేలా చేశావు అంటూ  ఆనందం వ్యక్తం చేశారు.  కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆమెకు వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కవిత ఈ నెల 23న అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.  
కుమారుడికి గ్రాడ్యుయేషన్ పట్టా.. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన కవిత Publish Date: May 20, 2025 3:02PM

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు

  హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మే17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గ‌రిష్ఠ టికెట్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన చార్జీలను యథాతథంగా ఉంచలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.  
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు Publish Date: May 20, 2025 2:54PM

ఏపీకి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వాతా వరణ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు  దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేసిన ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది.   కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య,  సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే  విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు  నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది.  
ఏపీకి భారీ వర్ష సూచన Publish Date: May 20, 2025 2:45PM

సవాళ్ళకు జవాబు.. క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ!

తెలుగు దేశం  అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,  ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు.  గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో..  అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో ..  చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు. రాష్ట ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి ఇవ్వలేదు. పార్టీ పటిష్టత పై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా పార్టీనే కాదు, రాష్ట్రం కూడా ఎంతగానో నష్ట పోయింది. వైసీపీ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో..  జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకు పోయారు.   గతంలోనే ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. మరో మారు అలాంటి అనర్ధం జరగ కుండా ఉండేందుకు, ఇప్పటికే చాల వరకు పట్టాల పైకి తెచ్చిన పరిపాలన పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, పార్టీ పటిష్ఠతపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు.  అవును.. కింది స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గాల వారీగా  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజానికి..  మారుతున్న పరిస్థితులకు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలకు  అనుగుణంగా నూతన పద్దతులను అడాప్ట్ చేసుకోవడం, ఆచరణలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొట్టినపిండి. అంతే కాదు ఒక్క రాజకీయ, పరిపాలన రంగాలలోనే కాదు, ఏ రంగంలో అయినా  టెక్నాలజీ సమర్ధవంతంగా వినియోగించుకోవడం అభివృద్దికి మూల మంత్రంగా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాలలో, అనేక వేదికల నుంచి ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన  తెలుగువన్  రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని చేసిన ప్రసంగంలోనూ.. చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ పాతికేళ్ళ విజయ ప్రస్థానం సాగించిన, తెలుగు వన్   చైర్మన్ కంఠంనేని రవిశంకర్  ను అభినందిచారు. అలాగే..  ఇటీవల కాలంలో అన్ని రంగాలకు ఆయువు పట్టుగా మారిన సోషల్ మీడియా సమర్ధ వినియోగం పైనా చంద్రబాబు నాయుడ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే..  నియోజకవర్గాల వారీగా నిర్వహించే  శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సంస్థాగత విషయాలు.. రాజకీయ అంశాలతో పాటుగా, సోషల్ మీడియా సద్వినియోగం విషయంలోనూ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నేతల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులకు రాజకీయ అవగాహన, రాజకీయ వ్యూహాల పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా..  స్వర్ణాంధ్ర విజన్ – 2047,  పీ – 4 ఇనిషియేటివ్స్ ముఖ్య ఉద్దేశాలపై అవగాహన కల్పిస్తామని నేతలు చెప్పారు. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం జరుగుతుందని తెలిపారు.   ఇప్పటికే కుప్పం, మంగళగిరి సహా మరి కొన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముందుగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన  విశాఖపట్నం నార్త్, చింతలపూడి, తెనాలి, పెనుగొండ,కనిగిరి నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఈ ఐదు నియోజక వర్గాల్లో శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మంచి చెడులను సమీక్షించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.      ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సిద్దాంతం, పార్టీ లక్ష్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన కార్యక్రమాలు, సోషల్ మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకోవడ్డం వంటి పలు కీలక అంశాలపై ఎంపిక చేసిన క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో  ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందని అంటున్నారు.  అదే విధంగా   వైసీపీ సోషల్ మీడియా సాగించే ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా మండల స్థాయి నుంచి కార్యకర్తలకు సోషల్ మీడియా సమర్ధ వినియోగంపై శిక్షణ ఇవ్వడం కూడా శిక్షణలో భాగంగా ఉంటుందని అంటున్నారు.
సవాళ్ళకు  జవాబు..  క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ! Publish Date: May 20, 2025 2:33PM