Top Stories

political-news-img

డ్రోన్ల నిఘాతో మహిళల రక్షణ.. తమిళనాడు సీఎం విజయ్,

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాలు, సామాజిక వేధింపుల ఘటనల నేపథ్యంలో మహిళా రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టానీ, ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని సీఎం విజయ్ నిర్ణయించారు. రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ సరికొత్త ప్రాజెక్ట్ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీగా పేరుగాంచిన సింగపూర్ డ్రోన్ సాంకేతికతను (రాష్ట్ర ప్రభుత్వం వినియోగించబోతోంది. దీని ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా మహిళల కదలికలపై నిఘా ఉంచి, ప్రమాదకర ప్రాంతాలలో వారికి తగిన రక్షణ కల్పించనున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన డ్రోన్ నిఘా ప్రాజెక్ట్ కోసం సీఎం విజయ్ 354 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ నిధులతో అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేయడంతో పాటు, పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తమిళనాడు పోలీస్ శాఖకు ప్రత్యేక యాప్‌లను అందించనున్నారు. డ్రోన్ల ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. మహిళలకు ఎక్కడైనా ముప్పు పొంచి ఉందని తెలిస్తే, ఈ డ్రోన్ల ద్వారా వెంటనే గుర్తించి పోలీసులు రంగంలోకి దిగేలా ఈ యాప్ ఆధారిత వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి, గంజాయి సాగుపై నిఘా పెట్టడానికి డ్రోన్ వ్యవస్థను వాడుతుండగా, తమిళనాడులో సీఎం విజయ్ మహిళల భద్రత కోసం ఈ టెక్నాలజీని రంగంలోకి దించుతున్నారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వతరా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Jun 10, 2026 2:33PM

political-news-img

ప్రతి మగాడు తెలుకోవాల్సిన నిజాలు.. మహిళలు ఎవరికీ చెప్పుకోలేక చాలా ఎక్కువ బాధపడేది వీటికే!

భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ, ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది. అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు, గోల్డ్, చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు. చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి. మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం.. మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం.. చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు. ఇది బయటకు తమాషాగా, సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు, భాగస్వామి పుట్టినరోజు, మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం.. మహిళలు ఆందోళనలను లేదా సమస్యలను తన భర్తతో షేర్ చేసుకున్నప్పుడు, దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని, ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం.. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం, భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతు ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు. భార్యను ఏదైనా మాటలు అన్నా, భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి, వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. మహిళలు చాలా భాధపడతారు. ఒంటరితనం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి, తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇతరులతో పోల్చడం.. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు. అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు, ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు. ప్రతి మనిషిని మనిషిగా చూడాలి, వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 10, 2026 2:28PM

political-news-img

నిమ్మరసంలో పొరపాటున కూడా దీన్ని కలిపి తాగకండి!

నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం ప్రయోజనాలను నాశనం చేస్తుంది. ఏదో అప్పుడప్పుడు నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికంగా చక్కెర కలపడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిమ్మరసం.. భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి, తేమతో కూడిన రోజులలో మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని, రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు. నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చక్కర కలిపితే.. నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు. నారింజ రసం కూడా.. నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచి మెరుగవ్వాలంటే.. నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది. చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. *రూపశ్రీ

Publish Date: Jun 10, 2026 2:23PM

political-news-img

టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం.. మరో ఎంపీ రాజీనామా

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తరువాత పార్టీలో ఎగసిపడిన అసమ్మతి జ్వాలలు ఢిల్లీ వరకూ విస్తరించాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్. సుస్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. కాగా రాజీనామా సమర్పించిన కొద్దిసేపటికే.. అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ నివాసంలో సుస్మితాదేవ్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుస్మితాదేవ్ త్వరలోనే కాషాయ జెండా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ భేటీపై విలేకరులు ప్రశ్నించగా.. ఇది కేవలం 'అస్సాం కనెక్షన్' మాత్రమేనని, అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె బదులిచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సుస్మితా దేవ్.. అస్సాం కాంగ్రెస్ దిగ్గజం అల్లాడి సంత్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, సిల్చార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా సుదీర్ఘ సేవలు అందించారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ను వీడి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఈమె చేరికతో ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాం, త్రిపురలలో పార్టీ బలోపేతం అవుతుందని టీఎంసీ భావించింది. కానీ, బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన సమీకరణాలతో ఆమె పార్టీ వీడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

Publish Date: Jun 10, 2026 12:56PM

political-news-img

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్‌, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. రానున్న 24 గంటల్లోనూ ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయనివాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Publish Date: Jun 10, 2026 12:45PM

political-news-img

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సంచలన హెచ్చరిక!

మహిళల టీ20 ప్రపంచకప్‌ సమరం రసవత్తరంగా మారుతోంది. మెగా టోర్నమెంట్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమి సౌతాఫ్రికా జట్టుకు ఒక పెద్ద కనువిప్పు లాంటిదని ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పష్టం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రాబోయే శనివారం మాంచెస్టర్ వేదికగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడాల్సి ఉంది. ఈ కీలక పోరుకు ముందు తమ వ్యూహాలను మరింత పదును పెట్టుకోవాలని, కేవలం నామమాత్రంగా ఆడితే సరిపోదని లారా వోల్వార్డ్ తన సహచర ఆటగాళ్లను గట్టిగా హెచ్చరించింది. ఐర్లాండ్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత కివీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలింగ్ మరియు బ్యాటింగ్ విభాగాల్లో తీవ్రంగా తడబడింది. న్యూజిలాండ్ జట్టు తమకంటే ఎంతో తెలివిగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుందని కెప్టెన్ అంగీకరించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఇలాంటి ఓటమి ఎదురవడం ఒక రకంగా మంచిదేనని, దీనివల్ల తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఢీకొట్టాలంటే పూర్తి స్థాయి వ్యూహాత్మక ప్రణాళికలు అవసరమని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వోల్వార్డ్ కుండబద్దలు కొట్టింది. ఈ ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు ఆల్ రౌండర్ క్లో ట్రయాన్ అద్భుతమైన ఫామ్ రూపంలో ఒక పెద్ద ఊరట లభించింది. కివీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆమె కేవలం 26 బంతుల్లోనే 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు రాబట్టింది. టోర్నీకి ముందే ట్రయాన్ ఇలా మెరుపు ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని కెప్టెన్ ప్రశంసించింది. ఆమె క్రీజులో సెట్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలేనని, ముఖ్యంగా లెగ్ స్టంప్ వెలుపల పడిన బంతులను కూడా కవర్స్ మీదుగా సిక్సర్లుగా మలచడం ఆమె ప్రత్యేకత అని కొనియాడింది. ఈ మెగా టోర్నీలో క్లో ట్రయాన్ తమ జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలుస్తుందని వోల్వార్డ్ ధీమా వ్యక్తం చేసింది. లారా వోల్వార్డ్ సైతం తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉండటం విశేషం. మరోవైపు, వార్మప్ మ్యాచ్‌లలో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టు శనివారం సౌతాంప్టన్ వేదికగా 2016 ఛాంపియన్ వెస్టిండీస్‌తో తలపడడం ద్వారా తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది. అయితే, ఈ జోరు చూసి తాము ఏమాత్రం అలసత్వానికి లోనుకాబోమని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మెలీ కెర్ హెచ్చరించింది. వెస్టిండీస్ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నారని, మెగా టోర్నీలో ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేమని ఆమె పేర్కొంది. ఇరు జట్లు సున్నా పాయింట్లతోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి కాబట్టి, ఆ రోజు ఎవరైతే తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని మెలీ కెర్ స్పష్టం చేసింది. మొత్తానికి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య సాగబోయే ఈ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Publish Date: Jun 10, 2026 12:45PM

MOVIE NEWS