అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకొంటున్నా: పవన్ కళ్యాణ్
Publish Date:Oct 17, 2015
Advertisement
ఆంద్రప్రదేశ్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, డా. కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జనార్ధన్ ఇవ్వాళ ఉదయం అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ న్ని ఆహ్వానించేందుకు ఆయన సర్దార్ సినిమా షూటింగ్ జరుగుతున్నా రామానాయుడు స్టూడియోకి వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా రిపోర్టర్ల చేతుల్లో నుండి కెమెరాలు బలవంతంగా గుంజుకొని వారి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. అందుకు పవన్ కళ్యాణ్ మీడియాకి క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత మంత్రులు అందించిన ఆహ్వానం స్వీకరించి వారితో రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా, “నేను ఈనెల 22న షూటింగ్ కోసం గుజారాత్ వెళుతున్నాను. నాకు ఏమాత్రం టైం దొరికినా శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాను. అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకుంటున్నాను. అందరికీ సంతోషం కలిగించే విధంగా అమరావతి నిర్మాణం జరగాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు. ఆయన చెప్పిన దానిని బట్టి ఆయన ఈ శంకు స్థాపన కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చునని భావించవచ్చును. కానీ ఈ కార్యక్రమం ప్రాధాన్యత తెలుసు గనుక తప్పకుండా హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని నిజాయితీగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డిలాగ నాకు షూటింగ్ ఉంది నేను రాను అని చెప్పలేదు. అదే జగన్ కి పవన్ కి ఉన్న తేడా. ఇదివరకు ఆయన రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బహుశః అందుకే ఆ రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా వారు కూడా సంతోషించే విధంగా రాజధాని నిర్మాణం జరగాలని కోరుకొంటున్నానని అని ఉండవచ్చును. అమరావతి మరో హైదరాబాద్ లాగ కాకూడదంటే బహుశః ఆయన ఉదేశ్యం అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించకుండా అన్ని జిల్లాలకు వికేంద్రింకరించమని సూచిస్తున్నట్లుంది. పవన్ కళ్యాణ్ చాలా హుందా వ్యవహరించారని చెప్పవచ్చును.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-45-51296.html





