ముంబయిలో 144 సెక్షన్.. ఒమిక్రాన్ తో అధికారుల అలర్ట్
Publish Date:Dec 11, 2021
.webp)
Advertisement
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 32కు చేరింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు వెలుగుచూశాయి. రాజస్థాన్ లో తొమ్మిది, కర్ణాటకలో నాలుగు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఏడు కేసులు ఒక్క శుక్రవారమే బయటపడ్డాయి. ఇందులో ముంబయి నుంచి మూడు, పింప్రీ-చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఒమిక్రాన్ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేనివారిని కూడా హోమ్ కార్వంటైన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడిపోయారు. రోడ్లపైనే కొందరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ముంబై అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ముంబయిలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు డిసెంబరు 1 నుంచి ముంబయి, పుణె, నాగ్పూర్ ఎయిర్పోర్టుల ద్వారా 61వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు మహారాష్ట్రకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు 10వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే. వారందరినీ ట్రేస్ చేసే పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది అడ్రస్ లు దొరకడం లేదని తెలుస్తోంది. దీంతో వాళ్లను ట్రేస్ చేసేందుకు అధికారులు చాలా కష్టపడాల్సి వస్తోంది.
http://www.teluguone.com/news/content/omicron-cases-hike-144-section-imposed-in-mumbai-25-128139.html












