నగదు లేని సమాజం రానుందా!
Publish Date:Nov 15, 2016
Advertisement
పెద్ద నోట్ల ఒక్క పెట్టున రద్దయిపోయాయి. బస్తాలకొద్దీ దాగిన నల్లధనం చిత్తుకాగితాలుగా మారిపోయింది. బినామీల పేరుతోనో, బంగారం పేరుతోనో ఇందులో కొంత భాగాన్ని చట్టబద్ధం చేసుకున్నా... చాలాభాగం వృధాగా మిగిలిపోక తప్పనిసరి స్థితి. సామాన్యలకు చిల్లర కష్టాల మాట ఎలా ఉన్నా, ఈ సంఘటనతో ఆన్లైన్ పేమెంట్ల మీదకి అందరి దృష్టీ మళ్లింది. ఎప్పటికప్పుడు నగదు లావాదేవీల మీద రకరకాల ఆంక్షలు జారీ కావడం, పరిమితులకు మించిన జమాఖర్చుల మీద నోటీసులు అందుకోవలసి రావడంతో... ఆన్లైన్ చెల్లింపులే మేలన్న అభిప్రాయానికి ప్రజలు ఈపాటికే వచ్చేశారు. పైగా మున్ముందు ఒక పరిమితికి మించిన నగదు చెల్లింపులను అనుమతించకపోవచ్చునన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాల వెనుక వాస్తవం కూడా లేకపోలేదు. ‘అర్థ క్రాంతి’ సిద్ధాంతాన్ని రూపొందించిన అనిల్ బొకిల్ వంటి ఆర్థిక నిపుణుల ప్రకారం నల్లధనాన్ని నివారించేందుకు ఇలాంటి పరిమితులు తప్పనిసరి. నిజానికి 500,1000 రూపాయల నోట్లు రద్దు చేయాలన్న మోదీ ఆలోచన కూడా అనిల్ ‘అర్థక్రాంతి’ సిద్ధాంతంలో భాగమే అంటున్నారు. చిన్నచిన్న లావాదేవీలు మినహాయిస్తే... బిల్లుల చెల్లింపులు, వస్తువుల కొనుగోళ్లు, బకాయిల వసూళ్లు వంటి లావాదేవీలు అన్నీ కూడా ఇక మీదట ఆన్లైన్లో సాగే రోజులు రావచ్చు. అసలు జేబులో ఒక్క రూపాయి లేకుండా రోజువారీ పనులు సజావుగా సాగిపోయే కాలమూ నిజం కావచ్చు. కానీ ఈ సౌకర్యాన్ని గ్రామీణ భారతం ఎంతవరకూ స్వీకరిస్తుందా అన్నదే అనుమానం! సెల్ఫోన్ ఆపరేట్ చేయడమే చేతకాని నిరక్షరాస్యులు ఆన్లైన్ బ్యాంకింగ్ వైపుగా ఎంతవరకు మొగ్గుచూపుతారన్నదే సందేహం. ఏది ఏమైనా నోట్ల రద్దుతో ఆన్లైన్ పేమెంట్లకి ఒక నూతన శకం మొదలైందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. దిల్లీలో ఒక టీ కొట్టు యజమాని ఆన్లైన్ పేమెంటుని అంగీకరించడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రోజుకి 20 లక్షల ఆనలైన్ లావాదేవీలు జరిపే పేటీఎమ్ సంస్థ ప్రస్తుతానికి 50 లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహించడం దీనికి పరాకాష్ట కావచ్చు. ఈ ఆన్లైన్ వేగం తాత్కాలికం అనుకోవడానికి లేదు. ఎందుకంటే సగటు భారతీయుడిది మధ్యతరగతి మనస్తత్వం. మనం సాంకేతికతకు వీలైనంత దూరంగా ఉంటాం. కానీ ఒక్కసారి అలావాటు పడితే ప్రపంచమంతా మనల్ని చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! అన్లైన్ చెల్లింపులలో పారదర్శకత ఉంటుంది, సమయం వృధా కాదు, లెక్కలకు సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇకమీదట అవకాశం ఉన్న భారతీయులంతా ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇదే జరిగితే కొన్నాళ్లకి నగదే లేని సమాజాన్ని చూడవచ్చేమో!
http://www.teluguone.com/news/content/narendramodi-45-69092.html





