మెహుల్ చోక్సీ దొరికాడు.. భారత్ కు అప్పగిస్తారా?
Publish Date:May 27, 2021
Advertisement
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ జాడ ఎట్టకేలకు తెలిసింది. అంటిగ్వా నుంచి క్యూబా పారిపోతున్న మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటిగ్వా నుంచి క్యూబాకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా మెహుల్ చోక్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం అంటిగ్వాలో ఆయన మిస్సయ్యారు. విందు కోసం రెస్టారెంట్ కు వెళ్లిన మెహుల్ చోక్సీ.. కనిపించకుండా పోయారు. ఆయన కారు మాత్రం సముద్రం దగ్గరలో కనిపించింది. దీంతో సముద్ర మార్గం ద్వారా క్యూబాకు వెళ్లిపోయి ఉంటారని భావించారు. పీఎన్బీ కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన అనంతరం మెహుల్ చోక్సీ భారత్ను వీడి అటిగ్వా, బార్బుడాకి పారిపోయారు. రూ.13,500 కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మోహుల్ చోక్సీ అదృశ్యంపై ఇప్పటికే ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసింది. చోక్సీ.. కరేబియన్లోని చిన్న ద్వీప దేశమైన డొమినికాకు సముద్రంలో పడవ ద్వారా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అంటిగ్వా అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మేరకు సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ అప్పగింతపై అంటిగ్వా, భారత్కు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని డొమినికా ప్రధాని వెల్లడించారు. అంటిగ్వాతో చర్చల అనంతరం భారత్కు అప్పగించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. 2018లో పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు, ప్రముఖ ఆభరణాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ భారత్ నుంచి పరారైన విషయం తెలిసిందే. మెహుల్ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకోగా.. నీరవ్ మోదీ లండన్కు పారిపోయాడు. ప్రస్తుతం వారిని దేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
http://www.teluguone.com/news/content/mehul-choksi-arrest-in-antigua-39-116327.html





