political-news-img

మూసీ అభివృద్ధి అంతా మోసం...రంగనాథ్‌‌‌పై కవిత ఫైర్

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే అవి తొలగించక పోతే డిఫమేషన్ కేసు వేస్తానని కవిత హెచ్చరించారు. కవిత మాట్లాడుతూ గతంలో ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ మూసీ నది పరిసరాల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోందని హైడ్రా అధికారులు స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. అదే అంశంపై తాము ధర్నా చేస్తే ఇప్పుడు తమపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. “మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫ్రూఫ్ లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడను. ఈరోజు సాయంత్రం వరకు హైడ్రా చేసిన ట్వీట్లు తొలగించకపోతే రంగనాథ్‌ను కోర్టుకు లాగుతాను” అని ఆమె స్పష్టం చేశారు. మూసీ నది మధ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయని తాము నిరసన వ్యక్తం చేసిన తర్వాతే హైడ్రా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వాయిస్ ఓవర్‌తో వీడియోలు పోస్టు చేశారని కవిత ఆరోపించారు. అయితే ఇదే నిర్మాణం విషయంలో 0.37 ఎకరాల ఆక్రమణ జరిగిందని, 23 మీటర్లు ఎన్‌క్రోచ్ అయ్యిందని హైడ్రా కమిషనర్ గతంలో ఒప్పుకున్నారని చెప్పారు.“పేదవాళ్ల ఇళ్లు కూల్చడంలో మాత్రం హైడ్రా చురుకుగా ఉంది. కానీ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోంది” అని కవిత విమర్శించారు. నాలాలను మళ్లించకుండా నిర్మాణాలు చేయడంతో కోకాపేట, నార్సింగ్ ప్రాంతాల్లో వరదలు వచ్చాయని కూడా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ప్రజలపై వదిలిన మహమ్మారిగా మార్చిందని ఆమె ఆరోపించారు. “పేదల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్లను కాపాడుతున్నారు. అందరికీ ఒకే రూల్ ఉండాలి. మూసీ నది మధ్యలో ఉన్న ఆ అక్రమ నిర్మాణాన్ని తప్పనిసరిగా కూల్చాలి” అని డిమాండ్ చేశారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా ముందుకెళ్తోందని కవిత అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే జాగృతి హెచ్చరించిందన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తిగా సిద్ధం కాలేదని, ఖర్చు అంచనాలు ఆరు నెలల్లోనే దాదాపు రూ.1400 కోట్లు పెరిగాయని ఆమె ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోతున్న వేలాది బాధితులను చర్చలకు పిలవకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు అధికారులతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితుల సమస్యపై ఈ నెల 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Publish Date: Mar 15, 2026 4:00PM

political-news-img

డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌ సాధ్యమేనా?

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఇటీవల వరకూ వనస్థలిపురం, రాచకొండ ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టివేతల వార్తలు వినిపించగా, ఇప్పుడు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లోనూ డ్రగ్స్ దందా బయటపడింది. కొన్ని హాస్టళ్లను అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలోనే ఈ వ్యాపారం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే కఠిన తనిఖీలు నిర్వహించి ఉంటే డ్రగ్స్ సమస్య ఇంతగా పెరిగేది కాదని వారు అంటున్నారు.స్థానికుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు దాడులు చేయడం కాకుండా హాస్టళ్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల మరోసారి టాలీవుడ్‌కు సంబంధించిన పేరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వినిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి పేరు ఈ కేసులో బయటకు రావడం చర్చనీయాంశమైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన సమాచారంతో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసే రెగ్యులర్ కస్టమర్‌గా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం.గత బీఆర్‌ఎస్ హయాంలో టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులపై కూడా గతంలో పెద్ద ఎత్తున విచారణలు జరిగాయి. ఈ కేసుల్లో సినీ ప్రముఖుల నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలడంతో ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు గతంలోనూ సంచలనం రేపాయి. పలువురు సెలబ్రిటీల పేర్లు విచారణల్లో వినిపించిన నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి సినీ ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన పేర్లు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మరోవైపు నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ పోలీసుల దాడితో బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్‌కుమార్, బీఆర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అడ్డంగా దొరికారు.

Publish Date: Mar 15, 2026 2:39PM

political-news-img

రాత్రంతా బైక్ ఆన్...పొగ పీల్చి నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోనే బైక్‌ను స్టార్ట్‌లో ఉంచి నిద్రపోవడంతో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వ్యాపించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన పుంగనూరు పట్టణంలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఘటనతో పట్టణం మొత్తం విషాదంలో మునిగి పోయింది.స్థానికులు మరియు పోలీసుల వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల తన ద్విచక్ర వాహనానికి ఇంజిన్ బోర్ వేయించుకున్నాడు. వాహనం సరిగ్గా సెట్ కావాలంటే కొంతసేపు లేదా రాత్రంతా బైక్ స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ సూచించాడు. మెకానిక్ ఇచ్చిన సలహా మేరకు ఇంటి యజమాని శనివారం రాత్రి బైక్‌ను ఇంటి గదిలోనే స్టార్ట్ చేసి తలుపులు మూసి నిద్రపోయారు. రాత్రంతా మూసివున్న గదిలో వాహనం నడుస్తుండడంతో సైలెన్సర్ నుంచి బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వాయువు గదిలోనే పేరుకుపోయింది. గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ గది మొత్తం విషవాయువుతో నిండిపోయింది. ఫలితంగా గదిలో నిద్రిస్తున్న తాత రామచంద్రయ్య (70), మనవడు కార్తీక్ (15), మనవరాళ్లు చందన (8), చరిత (8) ఆ విషవాయువు ను పీల్చి నిద్రలోనే మృతి చెందారు. ఆదివారం ఉదయం వరకు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి కిటికీ లోంచి లోపలికి చూడగా నలుగురు అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన మెకానిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు రక్తంలో కలిసినప్పుడు మనిషికి వెంటనే స్పృహ తప్పిపోతుంది. ఎలాంటి నొప్పి లేదా హెచ్చరిక లక్షణాలు లేకుండానే బాధితులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మూసి ఉన్న గదుల్లో వాహనాలను స్టార్ట్ చేయడం ఎంత ప్రమాదకరం... ప్రజలు ఇలాంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Publish Date: Mar 15, 2026 1:32PM

political-news-img

డ్రగ్స్ కేసు ఆరుగురికి పాజిటివ్....ఈగల్ టీం ఎస్పీ గిరిధర్

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్స్ వినియోగంపై నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు రితేష్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ, అనంతరం చేసిన బ్లడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఎస్పీ పేర్కొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌ను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. చేవెళ్ల ఆర్డీవో నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. సిపి యాక్ట్ ప్రకారం ఫామ్ హౌస్‌ను సీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఈ ఫామ్ హౌస్‌లో తరచుగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులు, పార్టీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై విచారణ సాగుతోంది.

Publish Date: Mar 15, 2026 1:07PM

political-news-img

డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో రోజుకో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా డ్రగ్స్ మూలాలపై కీలక సమాచారం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండటంతో ఈ వ్యవహా రం మరింత చర్చనీయాంశం గా మారింది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి రోహిత్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) సిల్వర్ శరత్ కుమార్.... ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు కౌశిక్ రవిని విచారించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా మరో కీలక అంశం బయటపడింది. శరత్ కుమార్ పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ వద్ద కోకైన్‌ను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈగల్ టీం శరత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుంచి రెండు కోకైన్ ప్యాకెట్ల ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరికీ కోకైన్‌ను శరత్ కుమార్ పంచినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. అయితే కొంత మిగిలిన కోకైన్‌ను తన జేబులో ఉంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి ఎవరు? నెట్‌వర్క్ ఎక్కడ నుంచి నడుస్తోంది? అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశముంద ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Publish Date: Mar 15, 2026 1:01PM

political-news-img

ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్...పాత ట్వీట్ వైరల్

హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పట్టుబడటంతో గతంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. గత వైసీపీ పాలనలో డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్ల 2017 మంది చనిపోయారని చెబుతూ మీ ఓటు ఏపీలో డ్రగ్స్‌ను అడ్డుకోగలదు అని ఆయన పోస్ట్ చేశారు. తీరా ఇప్పుడు ఆయనే డ్రగ్స్ కేసులో దొరికిపోవడంతో నెటిజన్లు ఆ ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్‌ టెస్ట్‌ విషయంలో ఎంపీ పుట్టా మహేష్‌ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్‌ శాంపిల్‌ బదులు నీళ్లు ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్‌ బాటిల్‌లో ఉంది యూరిన్‌ కాదని వాటర్ అని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్‌ శాంపిల్‌ ఇవ్వాలని.. నీళ్లు కాదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పుట్టా మహేష్‌ నుంచి యూరిన్‌ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్‌ బ్లడ్‌ టెస్టులో పాజిటీవ్‌గా నిర్ధారణైంది.

Publish Date: Mar 15, 2026 12:49PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img