డ్రగ్స్ రహిత హైదరాబాద్ సాధ్యమేనా?
హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఇటీవల వరకూ వనస్థలిపురం, రాచకొండ ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టివేతల వార్తలు వినిపించగా, ఇప్పుడు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లోనూ డ్రగ్స్ దందా బయటపడింది. కొన్ని హాస్టళ్లను అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలోనే ఈ వ్యాపారం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే కఠిన తనిఖీలు నిర్వహించి ఉంటే డ్రగ్స్ సమస్య ఇంతగా పెరిగేది కాదని వారు అంటున్నారు.స్థానికుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు దాడులు చేయడం కాకుండా హాస్టళ్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల మరోసారి టాలీవుడ్కు సంబంధించిన పేరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వినిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి పేరు ఈ కేసులో బయటకు రావడం చర్చనీయాంశమైంది. మాసబ్ట్యాంక్ ప్రాంతంలో పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన సమాచారంతో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ను కొనుగోలు చేసే రెగ్యులర్ కస్టమర్గా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం.గత బీఆర్ఎస్ హయాంలో టాలీవుడ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులపై కూడా గతంలో పెద్ద ఎత్తున విచారణలు జరిగాయి. ఈ కేసుల్లో సినీ ప్రముఖుల నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలడంతో ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారాలు గతంలోనూ సంచలనం రేపాయి. పలువురు సెలబ్రిటీల పేర్లు విచారణల్లో వినిపించిన నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి సినీ ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన పేర్లు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మరోవైపు నగరంలో డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్ హౌస్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ పోలీసుల దాడితో బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్కుమార్, బీఆర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అడ్డంగా దొరికారు.
Publish Date: Mar 15, 2026 2:39PM