Top Stories

dummy

political-news-img

హైదరాబాద్‌లో గుజరాత్ పోలీసుల సోదాలు .. చిన్నారుల అక్రమ రవాణా నెట్‌వర్క్ బట్టబయలు

చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు మళ్లీ హైదరాబాదు నగరానికి వచ్చి భారీ సోదాలు నిర్వహించడం నగరంలో కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన మురుగన్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మురుగన్ నిర్మించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పోలీసులు మురుగన్‌కు సంబంధాలున్నట్లు భావిస్తూ హైదరాబాద్ లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు నిర్వహించారు, 49ఐవీఎఫ్, సికింద్రాబాద్ హెగ్డే ఐవీఎఫ్, బంజారా హిల్స్, నోవా ఐవీఎఫ్, కూకట్‌పల్లిలకు మురుగన్ తో సంబంధాలపై ఈ సోదాలు జరిగాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, రికార్డులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. మురగన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఏడాదిలో దేశవ్యాప్తంగా సుమారు పాతిక మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ గుజరాత్ పోలీసుల అదుపులో ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని పేర్లు, మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Publish Date: Apr 30, 2026 2:50PM

political-news-img

సాఫ్ట్ వేర్ సీతారాం ఆత్మహత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!

హైదరాబాదు నగరాన్ని కుదిపేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధాలు, ప్రైవేట్ వీడియోల పోస్టింగ్, కుటుంబ కలహాలు…చివరకు మానసిక వేదన భరించలేక ఆత్మహత్య...ఈ ఘటనలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు పోలీసులు సీతారాం భార్య రేణుక, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులను తాజాగా అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తరువాత లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు. సీతారాం తన భార్య రేణుకకు ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేశాడు. తాను నెలకు రెండు లక్షల జీతం సంపాదిస్తూ భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాననీ.. , కానీ తనకు తెలియకుండా ఆమె ఇతరులతో సంబంధాలు కొనసాగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహారశైలి మారలేదని.. మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ అతను సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సీతారాం పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. రేణుకతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను ఆమె ప్రియుడు రమణరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై గతంలోనే పెద్ద వివాదం చోటుచేసుకొని, రేణుక, రమణ రెడ్డి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. సీతారాం వదిలిన సూసైడ్ నోట్‌ను కీలక ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. ఇటీవల పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణ రెడ్డి, మరో వ్యక్తి శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Publish Date: Apr 30, 2026 2:33PM

political-news-img

ఈ ఏడు తెలుగుదేశం మహానాడు నెల్లూరులో

తెలుగుదేశం పండుగ మహానాడు ఈ ఏడాది నెల్లూరులో జరగనుంది. తొలుత మహానాడును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని పార్టీ భావించింది. శ్రీకాకుళం జిల్లా చాపురం లో వచ్చే నెల 27, 28, 29 తేదీలలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మే చివరిలో పార్టీ మహానాడును నిర్వహించిన తరువాత స్వల్ప వ్యవధిలో మోడీ ఉత్తరాంధ్రపర్యటనకు ఏర్పాట్లు, జనసమీకరణ, భద్రతా ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న భావనతో వేదిక మార్పునకు పార్టీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అదలా ఉండగా ఇప్పటికే మహానాడు వేదిక మార్పుకు సంబంధించి తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ శ్రీకాకుళం, నెల్లూరు పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నేతలను ఆయన ఆదేశించారని చెబుతున్నారు.

Publish Date: Apr 30, 2026 1:27PM

political-news-img

కేరళ ఎగ్జిట్ పోల్స్.. హస్తవాసి చాలా బాగుంది!

దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో వివిధ జాతీయ, ప్రాంతీయ సంస్థలు బుధవారం (ఏప్రిల్ 29) వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. సుదీర్ఘ విరామం తర్వాత కేరళలో అధికార మార్పిడి జరగబోతోందనీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ సర్కార్ గద్దె దిగడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్సూ కూడా అంచనా వేశాయి. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం (ఏప్రిల్ 29) వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. ఇందుకు యాంటీ ఇంకంబెన్సీ, కారణమని పేర్కొన్నాయి. దానికి తోడు.. కాంగ్రెస్ దూకుడు కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వెనుకబాటుకు కారణమని విశ్లేషించాయి. కాగా.. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు చెందిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కేరళలో ఇంచుమించు పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించి.. యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఈ ప్రచార సమయంలో కేరళ సీఎం విజయన్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు సర్వేల ఫలితాలు సూచిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే కేరళలో యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు దక్కుతాయని పేర్కొనగా, పోల్ ల్యాబ్ సర్వే ఏకంగా 90 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ అయితే కాంగ్రెస్ కూటమి 72 నుంచి 80 , పీపుల్స్ పల్స్ 75నుంచి 85 స్థానాలను యూడీఎఫ్ సాధిస్తుందని అంచనా వేశాయి. ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి 76 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక సర్వే సంస్థల అంచనాల మేరకు అధికార ఎల్‌డీఎఫ్ కూటమి 45 - 66 స్థానాలకే మధ్యే పరిమితమయ్యే అవకాశం ఉంది బీజేపీ కేరళలో తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు పేర్కొన్నాయి. చాలా వరకూ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేశాయి. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైనట్లు అవుతుంది. గత ఎన్నికల్లో విజయన్ ఈ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పండుగ చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలో కూడా పట్టు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి పునర్వైభవం వస్తుందని హస్తం నేతలు అంటున్నారు.

Publish Date: Apr 30, 2026 12:27PM

political-news-img

విజయ్ టీవీకేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా అంచనా

ఏప్రిల్ 29న‌ విడుదలైన తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ప్రదీప్ గుప్తాకి చెందిన‌ యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు అందరినీ విశ్మయ పరిచాయి. తమిళనాట విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. అంటే తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆయన అంచనా అన్నమాట. ఇక డీఎంకే కూటమికి 92 నుంచి110 సీట్లు, అన్నాడీఎంకేకి 22 - 32 సీట్లు వ‌స్తాయ‌ని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. ప్ర‌దీప్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమిళనాట సుమారు 42శాతంగా ఉన్నారు. వీరంతా గంప‌గుత్త‌గా విజయ్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఆయన టీవీకే విజయం సాధిస్తుందనీ, ఆ విజయం 1983లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో పోల్చదగినదిగా ఉంటుందనీ పేర్కొన్నారు. అదలా ఉంటే.. మిగిలిన ప్రముఖ సర్వేలన్నీ.. డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ ప‌ల్స్ సర్వే అయితే డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు వస్తాయనీ, విజయ్ టీవీకే 18 నుంచి 24 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందనీ పేర్కొంది. అదే విధంగా మాట్రిజ్ సర్వే టీవీకే పార్టీకి పది నుంచి పన్నెండ్లు సీట్లు రావడమే గగనమని పేర్కొంది.ఇక పోతే.. పీమార్క్ సర్వీ విజయ్ పార్టీ 16 నుంచి 26 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అంటే.. ఒకవైపు దాదాపు అన్ని సర్వేలూ.. స్టాలిన్ హవా కొనసాగుతుందని చెబుతుంటే, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ విజయం ఖాయమని పేర్కొంది. అయితే.. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. యాక్సిస్ మై ఇండియా గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అది తప్పవడంతో ప్రదీప్ గుప్తా టీవీ లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన అంచనాలు తప్పినా.. అంతకు ముందు.. అంటే గతంలో దాదాపు 90శాతం పైగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఈసారి ఆయన విజయ్ పై వేసిన విజిల్ నిజమవుతుందా లేదా? అన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.

Publish Date: Apr 30, 2026 11:53AM

political-news-img

32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు.. డీజీపీ శివధర్​రెడ్డి

32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయని డీజీపీ శివధర్​రెడ్డి గుర్తు చేసుకున్నారు. శివధర్ రెడ్డి డీజీపీగా గురువారం (ఏప్రిల్ 30) పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పోలీసింగ్ విధానాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చాయన్న ఆయన.. పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, కొత్త డీజీపీ సీవీ ఆనంద్​కు అభినందనలు తెలిపారు. కాగా పదవీ విరమణ చేసిన శివధర్‌రెడ్డికి నూతన డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. శివధర్‌ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్న సీవీ ఆనంద్‌, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పని చేశారని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారనీ చెప్పారు.

Publish Date: Apr 30, 2026 11:35AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img