టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్.. ఇప్పుడు ఎమ్ఆర్ఎస్!
Publish Date:Oct 25, 2024
Advertisement
బీఆర్ఎస్ పార్టీకి పేరుతో పెద్ద చిక్కే వచ్చిపడింది. టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలు పెట్టిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అనుకూలంగా అందరి మద్దతూ పొందింది. సరే తెరాస ఉద్యమాల కారణంగానో.. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనివార్యత వల్లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ కంటే.. కోట్లాడి తెలంగాణ సాధించాను అన్న కేసీఆర్ మాటనే ప్రజలు విశ్వసించారు. సరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు తెరాసకే పట్టం కట్టారు. ఉద్యమ పార్టీగా జనం తెరాసను గుండెల్లో పెట్టుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది కాలానికే తెరాస అధినేత కేసీఆర్.. తెరాస ఉద్యమ కార్యాచరణ ముగిసిందనీ, ఇక తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. అక్కడ నుంచి ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బార్లా తెరిచేసి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. సరే రెండో మారు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తీవ్ర ఆకాంక్షతో పార్టీ పేరును మార్చేశారు. అంటే టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఆ సందర్భంగా ఆయన చేసిన హడావుడీ, హంగామా అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ ను విస్తరించారు. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఔరంగాబాద్, నాందేడ్ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా, ఆ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆ హడావుడి, ఆర్భాటం చూసి మహారాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతున్నదని అంతా ఊహించారు. అయితే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఈ ఓటములతో కేసీఆర్ దాదాపుగా అజ్ణాతవాసంలోకి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ అయిపోయారు. పార్టీలో ఉన్న నేతలకు కనీసం కేసీఆర్ దర్శన భాగ్యం కూడా కలగని పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరును ఎమ్ఆర్ఎస్ గా మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశారు. మహారాష్ట్ర రాజ్య సమితిగా భారత రాష్ట్ర సమితి పేరు మార్పునకు వారు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్, రైతు సంఘాల మద్దతుతో మహారాష్ట్ర ఎన్నికలలో కనీసం80 స్థానాలలో ఎమ్ఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. సో.. కత్తీ పోయి కర్రా వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చే.. బీఆర్ఎస్ పోడి ఎమ్ఆర్ఎస్ వచ్చే అనుకోవాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/maharashtra-brs-decided-to-change-party-name-39-187367.html





