కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. ప్రియుడి కోసం కోటి నొక్కేసింది!
Publish Date:Jun 29, 2026
Advertisement
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. కాబోయే భార్యే కాలయముడిగా మారి, తన ప్రియుడితో కలిసి ఆడిన కిరాతక నాటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసు వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, నిందితురాలు సియా గోయల్ పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ అగర్వాల్ నుంచి ఏకంగా కోటి రూపాయల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అయితే ఆ సొమ్మును షాపింగ్కు వాడకుండా, రహస్యంగా తన ప్రియుడైన చేతన్ చౌదరికి అందజేసింది. చేతన్ కెరీర్, వ్యాపారాల్లో స్థిరపడటానికి ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టాలని వీరిద్దరూ ముందుగానే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి చేతన్కు కనీసం మూడేళ్ల సమయం పడుతుందని భావించిన ఈ జంట, కేతన్ను వదిలించుకున్నాక అంతా సద్దుమణిగాక వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశారు. హత్య జరిగిన తర్వాత సుమారు మూడు సంవత్సరాల పాటు సియా ఎలాంటి పెళ్లి చేసుకోకుండా సాధారణంగా గడపాలని, ఆ తర్వాతే చేతన్ను పెళ్లాడాలని ఇద్దరూ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట పరిసరాల్లో జరిగిన ఈ ఘాతుకానికి ముందే వీరు సంకేతాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కోటపై నడుస్తున్న సమయంలో సియా షూ లేస్ కట్టుకుంటున్నట్లు లేదా నీళ్లు తాగుతున్నట్లు కిందకు వంగిన వెంటనే, అదే అదనుగా చేతన్ వెనుక నుంచి వచ్చి కేతన్ను లోయలోకి నెట్టేయాలని పథకం రచించారు. కేతన్ పడిపోయే సమయంలో సియాను పట్టుకునేందుకు కూడా వీల్లేకుండా ఈ వ్యూహాన్ని అమలు చేశారు. ఈ కిరాతక చర్యకు కేవలం 34 నిమిషాల ముందే సియా, చేతన్ చౌదరిల మధ్య రహస్య కాల్ సంభాషణ జరిగినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా పోలీసులు గుర్తించారు. అదే హత్యకు తుది సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, పోలీసుల నిఘా నేత్రాలు, హైవే టోల్ ప్లాజాల వద్ద దొరకకుండా ఉండేందుకు చేతన్ కారును పక్కనబెట్టి, పుణే నుండి లోహగఢ్ కోట వరకు స్కూటర్పైనే ప్రయాణించడం గమనార్హం. ఈ దారుణ ఉదంతంపై స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నమ్మిన వ్యక్తిని ఇంత దారుణంగా మోసం చేసి, ప్రాణాలు తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కోటి రూపాయల లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. త్వరలోనే వీరిపై పక్కా సాక్ష్యాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/ketan-agarwal-murder-case-36-224494.html





