కేంద్రంతో ఘర్షణ వైఖరి తెలంగాణకు మంచిది కాదు!
Publish Date:Jul 16, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తి కావొస్తోంది. ఈ 45 రోజుల కాలంలో కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రతిపక్షంలో వుంది కాబట్టి, అధికారం వస్తుందని కలలు కని ఫెయిలయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తరహా విమర్శలు చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఈ విమర్శలను లైట్గా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి రాజకీయ ఎజెండా లేని వర్గాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం విషయంలో ఒక బలమైన విమర్శ వినిపిస్తోంది. అది కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో వినిపిస్తోంది. కేసీఆర్ అధికారాన్ని చేపట్టిన దగ్గర్నుంచి కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరినే అనుసరిస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో అయినా, హైదరాబాద్లో ఉమ్మడి పోలీసింగ్ విధానం విషయంలో అయినా, మరికొన్ని ఇతర అంశాల విషయంలో అయినా కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకునే విధంగానే వ్యవహరించింది. ఒకవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో చాలా సయోధ్యగా వ్యవహరిస్తోంది. కొన్ని సందర్భాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరించకపోయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సందర్భాలలో కూడా కేంద్రంతో స్నేహపూర్వకంగానే వ్యవహరించింది. మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా కేసీఆర్కి, టీఆర్ఎస్కి పెద్ద నష్టం వుండొచ్చు.. వుండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో తెలంగాణకు మాత్రం నష్టం జరిగే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా సామరస్య పూర్వక వైఖరిని అనుసరించడం వల్ల తెలంగాణకు మేలు జరుగుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో తన వ్యవహారశైలిని మార్చుకుంటే తెలంగాణకు మేలు చేసినవారు అవుతారని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-telangana-government-central-government-45-35949.html