ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
Publish Date:Jul 5, 2025
Advertisement
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలలో కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలియడంతో అవి సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. జ్వరం అదుపులోనికి రావడం, సుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి రావడంతో ఆయన ఈ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు శుక్రవారం ఆయన ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో ఆక్కడే ఆయన ఇష్ఠాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రైతుల కష్టాలు, యూరియా లభ్యత, సాగునీరు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై ఆయన వారితో ముచ్చటించారు. అదే సమయంలో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో మీడియా ముందుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక నేపధ్యంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kcr-discharge-from-hospital-39-201327.html





