కాంగ్రెస్’లో చేరికల చిచ్చు.. రేవంత్ వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్
Publish Date:Jul 8, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి ... చేరికలతో పాటుగా నిరసన స్వరాలు, వ్యతిరేక నినాదాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంత కాలంగా కొంత గుంభనంగా ఉన్న విబేధాలు భగ్గు మంటున్నాయి. ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంతవరకు ఆయన పార్టీపై పట్టు సాధించ లేక పోయారు. పీసీసీ కుర్చీలో కుదరుగా కూర్చున్నది లేదు, అందుకే పార్టీలో విబేధాలు రోజు రోజుకు పై మెట్టుకు చేరుతున్నాయే, తప్ప దిగిరవడం లేదని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలు రేపుతున్న చిచ్చు విషయానికి వస్తే, పైన అనుకున్న విధంగా ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. తాజాగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ నేత మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని, సగౌరవంగా పార్టీలోకి స్వాగతించారు. ఎర్ర శేఖర్ తో పాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్’లో సందడి చేశారు. కానీ, ఆ సందడి పూర్తిగా సర్డుమణగక ముందే ఎర్ర శేఖర్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల విమర్శలు మొదలయ్యాయి. నేర చరిత్ర కలిగిన ఎర్రశేఖర్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు, అంటూ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతే కాదు, ఎర్ర శేఖర్ ఎంట్రీ పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అదలా ఉంటే కొంతకాలం వెనక్కి వెళితే, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే వడ్డేపల్లి రవి కాంగ్రెస్లో చేరారు. ఆయన్ని 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని, సస్పెన్షన్ ఎత్తివేయకుండా, మళ్ళీ పార్టీలోకి ఎలాతీసుకుంటారని రేవంత్ రెడ్డి వర్గం, కోమటి రెడ్డిని తప్పు పట్టింది. అంతేకాదు, మర్యాద పూర్వకంగా పీసీసీ చీఫ్ కు కలిసేందుకు ఇంటికొచ్చిన వడ్డేపల్లి ముఖం మీదనే రేవంత్ రెడ్డి తలుపులు వేశారు. రవిని రేవంత్ కలవలేదు. గేటు బయటి నుంచే వెనక్కి పంపించేశారు. ఇంకొంత వెనక్కి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కానీ, తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అలిగి కూర్చున్నారు. అలాగే,ఇటీవల సీఎల్పీ మాజీ నేత, పీజేఆర్ కుమార్తె, తెరాస కార్పొరేటర్ విజయా రెడ్డి, మళ్ళీ సొంత గూటికి చేరారు. పీసీసే చీఫ్ రెంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన రెడ్డి మాత్రం, సోదరి చేరికను గట్టిగానే వ్యతిరేకించారు. తన సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ తనతో చర్చించలేదన్నారు. అంతే కాకుండా, రెంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను లంచ్ కి ఆహ్వానించి సమాలోచనలు జరిపారు. సోదరి విజయా రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన సీనియర్లతో సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలోనే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, పార్టీలో చేరుతున్న ఎవరికీ, టికెట్ హామీ ఇవ్వడం లేదని ప్రకటించారు. అయితే, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కుర్చీలో ముందుగా కర్చీఫ్ వేసేందుకే, సీనియర్లను పక్కన పెట్టి, ఇతర పార్టీలలో తనకు మద్దతుగా నిలిచే వారిని ఏరి కోరి పార్టీలో చేర్చుకుంటున్నారని,సీనియర్ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే కావచ్చును, రేవంత్ రెడ్డి తాజాగా, సోనియా గాంధీ ఎవరి పేరు చెపితే వారిని, పల్లకీలో భుజాన మోసుకెల్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెడతానని ప్రకటించవలసి వచ్చిందని అంటున్నారు. నిజానికి, ఒక్క చేరికల విషయంలోనే కాదు, ఇతరత్రా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ అన్న విధంగానే ఇతర సీనియర్ నాయకుల ప్రవర్తన ఉంటోంది. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో నిర్వహించిన చింతన శిబిర్ లో ఆమోదించిన తీర్మనాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం, రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్వర్యంలో జూన్ 1 నుంచి రెండు రోజులు హైదరాబద్’లో రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించింది. అలాగే, గతంలో రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలను అప్పగిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటీవల ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు ఏవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, గోడకేసి కోడతానంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఇదలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంకా ఆయన పార్టీఫై పూర్తి పట్టును సాధించలేక పోయారు. సీనియర్లతో సయోధ్యత ఎండమావిగానే మిలిపోయింది. మరో వంక అయన దూకుడు పెంచిన కొద్దీ, పార్టీలో వ్యతిరేకత అదే స్థాయిలో పెరుగుతోంది, ఎదురు తిరుగుతోంది. మరోవంక రేవంత్ రెడ్డి సారధ్యంలో జరుగుతున్న చేరికలు ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునేందుకు పనికోస్తాయే తప్ప పార్టీ ఇమేజ్ ని పెంచేందుకు ఏ మాత్రం పనికొచ్చేవి కాదని, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి, పార్టీలో కొత్తగా చేరుతున్న నేతల వలన నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, తిరుగుబాట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికతో, గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిండ్ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మరో వంక, రేవంత్ రెడ్డికి మొదటి నుంచి దూరంగా ఉంటున్న పీజేఆర్ కుమారడు విష్ణు వర్దన్ రెడ్డి రేపు ఏమి చేస్తారో .. తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ లో చేరికల సందడిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీలో చేరికలు చిచ్చుపెడుతున్నాయి అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోందని రాజకీయ పండితులు విశ్లేస్తిస్తున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి పార్టీ పాలిట మరో సిద్దూ అవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/joining-rift-in-congress-telangana-congress-versus-revanth-25-139311.html





