అమెరికాతో ముఖాముఖి చర్చలకు ఇరాన్ నో!
Publish Date:Apr 25, 2026
Advertisement
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు మరో సారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నియమించిన ప్రత్యేక ప్రతినిధులతో ముఖాముఖి చర్చలకు ఇరాన్ నో చెప్పింది. పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఈ శాంతి చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. అగ్రరాజ్యం తన పాత షరతులనే మళ్లీ తెరపైకి తేవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇరాన్.. ఈ పరిస్థితుల్లో చర్చల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని తెగేసి చెప్పింది. మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది. అదలా ఉంటే.. అమెరికా తన పట్టు విడ వటం లేదు. ఇరాన్ చర్చలకు సిద్ధమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ఏదైనా ఒప్పందం కుదురుతుందని అగ్రరాజ్యాధినేత చెబుతున్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలని, హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ షరతులకు ఇరాన్ సమ్మతి తెలిపితేనే చర్చలు సఫలమవుతాయనీ, ఒప్పందం కుదురుతుందని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పరోక్ష చర్చలు అనడం అమెరికా వైఖరిపట్ల అపనమ్మకంతోనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తన ప్రకటనల్లో తరచుగా ఇరాన్ పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడం, ఇరాన్ నౌకలపై దాడులకు ఆదేశాలు ఇవ్వడం వంటి పరిణామాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో ఈ ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలిగే సూచనలు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/iran-says-no-to-face-to-face-talks-with-america-36-218253.html





