చట్టాలు కాగితాలకే పరిమితమా? క్షేత్రస్థాయిలో న్యాయం అందని ద్రాక్షేనా?
Publish Date:Apr 26, 2026
Advertisement
దేశంలో చట్టాలు అత్యంత పటిష్టంగా, లోతైన విశ్లేషణతో రూపొందాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల నుంచి క్రిమినల్, సివిల్ చట్టాల వరకు ప్రతి అంశం కాగితంపై చాలా స్పష్టంగా, పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ చట్టాలు క్షేత్రస్థాయిలో సమాన్యులకు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. చట్టం బలంగా ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం. కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం. చట్టానికి, సమాజానికి మధ్య అగాధం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది. దేశంలో చట్టాలు ఐడిలిస్టిక్ కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. 1961లోనే కట్న నిషేధ చట్టం తీసుకువచ్చనా.. 2026 నాటికి కూడా వరకట్నం అన్నది సామాజికంగా ఒక ఆచారంగానే కొనసాగుతూనే ఉంది. అలాగే దేవాలయాల్లో నియమాలు కూడా, కోర్టు తీర్పులు ఎన్ని ఉన్న.. ప్రజలు సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే చట్టాలు సమాజాన్ని పై నుంచి మార్చాలని చూస్తున్నాయి తప్ప, క్షేత్ర స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రజలలో మార్పు తీసుకురావడంలో విఫలమవుతున్నాయి. భారత సమాజం చట్టం కంటే భయానికి, నీతికి ఎక్కువగా లొంగుతుంది. పేద వర్గాల్లో దేవుడి భయం, పాపం అనే భావనలు వారిని నైతికతకు కట్టుబడి ఉండేలా చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, సంపన్న, విద్యావంతులలలో విద్యావంతులైన మాత్రం అది కనిపించడం అరుదు. వీరిలో చట్టం పట్ల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. సిస్టమ్ను మేనేజ్ చేయవచ్చు, లేదా ఒక లాయర్ను పెట్టుకుని కేసును ఏళ్ల తరబడి సాగేలా చేయవచ్చ అన్న ధీమాయే వీరిలో చట్టం పట్ల భయం, గౌరవం తగ్గిపోవడానికి కారణమౌతోంది. ఫలితంగా.. చట్టం ద్వారా నిజమైన నియంత్రణ అనేది కానరావడంలలేదు. భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పెరిగిపోతున్న పెండింగ్ కేసులు. ఇవి గుట్టల్లా.. కాదుకాదు కొండల్లా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నట్లు అంచనా. వీటిలో 85 శాతం కేసులు దిగువ కోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు దశాబ్దాల పాటు సాగడం వల్ల తరతరాల జీవితాలు కోర్టుల చుట్టూ తిరగడంలోనే గడిచిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా, సగానికి పైగా కేసుల్లో ప్రభుత్వమే ఒక పక్షంగా ఉండటం వ్యవస్థపై అదనపు భారాన్ని పెంచుతోంది. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నప్పటికీ.. వాటిని అమలు చేసే సొంత యంత్రాంగం కోర్టులకు లేదు. కోర్టు తీర్పు అమలు కావాలంటే పోలీసు, రెవెన్యూ శాఖల మీద ఆధారపడాల్సిందే. ఈ విభాగాలు అవినీతి, రాజకీయ ఒత్తిడి, పనిభారం వంటి వాటిలో కూరుకుపోయి ఉన్నాయి. దీంతో తీర్పు వచ్చినా బాధితుడికి న్యాయం అందడం లేదు. ఒక కేసులో గెలవడం అంటే సమస్య ముగియడం కాదు.. తీర్పు అమలు కోసం మరో కొత్త పోరాటం మొదలవ్వడమే అనే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. మరోవైపు, కోర్టులు మౌలిక వసతుల కల్పనపై కంటే.. , సామాజిక, మతపరమైన అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు భవనాల్లో కనీస సౌకర్యాలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ వంటి వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ జాప్యం కారణంగా ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి, అక్రమ పంచాయతీలు, స్థానిక స్ట్రాంగ్ మెన్ తీర్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. కోర్టులో 20 ఏళ్లు తిరగడం కంటే, అక్కడే తక్షణ పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. నిజమైన మార్పు రావాలంటే చట్టాల సంఖ్య కంటే వాటిలో స్పష్టత పెరగాలి. సామాన్యుడికి అర్థమయ్యేలా సరళమైన ప్రక్రియలు ఉండాలి. చట్ట ఉల్లంఘన జరిగితే శిక్ష పడుతుందనే భయం కలగాలి. ప్రభుత్వ లిటిగేషన్లను తగ్గించి, విచారణలు వేగంగా ముగిసేలా సంస్కరణలు చేపట్టాలి. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల మార్పు రాదు; గాంధీజీ వంటి సంస్కరణవాదులు చేసినట్లుగా సమాజం లోపల నుంచి మార్పు మొదలవ్వాలి. ఒక దేశ అభివృద్ధి కేవలం జీడీపీతో కొలవలేము. చట్టం, నీతి, దైనందిన జీవితం మధ్య ఉన్న అంతరం ఎంత తగ్గిందనేదే అసలైన అభివృద్ధి. చట్టం కేవలం కాగితంపై కాకుండా, సామాన్యుడికి భరోసా ఇచ్చే వెపన్ గా మారాలి. అప్పుడే ఇండియా నిజమైన ప్రగతి సాధించినట్లౌతుంది. References https://indiajusticereport.org/indicator/319/ijr-3/all-states/table?utm_source=copilot.com - సీతారాం కంఠంనేని
https://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India?utm_source=copilot.com
http://www.teluguone.com/news/content/india-laws-strong-on-paper-36-218306.html





