వానాకాలంలో హైదరా ‘బాధలు’.. అధికారులకు రేవంత్ వార్నింగ్
Publish Date:Jun 15, 2026
Advertisement
హైదరాబాద్ ప్రజలు వర్షాకాంలో పడే బాధలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. విశ్వనగరం చినుకు పడతే చాలు విశ్వ నరకంగా మారిపోతోందన్న విమర్శలు ఇకపై వినిపించకూడదని అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి భారీ వర్షం తరువాత తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన పడితే జనజీవనం స్తంభించిపోవడం, రోడ్లన్నీ జలమయం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 9 న నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొన్న నరకయాతనను, ట్రాఫిక్ గందరగోళాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం వల్లే ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇకపై వర్షాలు కురిసే సమయంలో ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయాలకో, ఇళ్లకో పరిమితం కాకూడదనీ, మున్సిపల్, పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖల అధికారులు ఖచ్చితంగా రోడ్లపైనే ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని విస్పష్టంగా చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే పూర్తి బాధ్యత అధికారులదేనన్న ఆయన.. నగర వాసులకు కనీస అసౌకర్యం కలిగినా సహించేది లేదనీ.. విధుల్లో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఇసుమంతైనా సహించబోననీ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ప్రజల రక్షణ కోసం తానే స్వయంగా రోడ్లపైకి వస్తానన్నారు. సీఎం క్షేత్రస్థాయిలోకి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దనీ.. అంతకంటే ముందే అధికారులు అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణమే డ్రైనేజీ క్లియరెన్స్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/hyderabads-monsoon-woes-36-222937.html





