సిద్ధిపేటలో ఏం జరిగింది? దుబ్బాకలో అసలేం జరుగుతోంది?
Publish Date:Oct 27, 2020
Advertisement
దుబ్బాక ఉప ఎన్నిక అధికార పార్టీని భయపెడుతోందా? బీజేపీ టార్గెట్ గా సోదాలకు కారణమేంటి? సిద్దిపేటలో దొరికిన డబ్బు ఎవరిది? రఘునందన్ రావే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారా?. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. గత రెండు రోజులుగా దుబ్బాక, సిద్దిపేటలో జరుగుతున్న పరిణామాలు కలవరం రేపుతున్నాయి. అసలు దుబ్బాకలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ వరకు పరిస్థితి ఎలా ఉండబోతోంది, పార్టీలు ఎలాంటి వ్యూహాలు అవలంభించబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. దసరా పండుగ మరుసటి రోజే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. సిద్ధిపేటలోని రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షల రూపాయలు దొరికాయని, ఆ డబ్బును సీజ్ చేశామని సిద్ధిపేట సీపీ ప్రకటించారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం పోలీసులపై డబ్బులను రఘునందన్ రావు మామ ఇంట్లో పెట్టారని ఆరోపిస్తున్నారు. డబ్బుల కట్టలు ఉన్న బ్యాగు పోలీసుల చేతిలో ఉన్న వీడియో వైరల్ గా మారింది. పోలీసులు డబ్బును ఇంట్లో పెడుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్లి ఆ బ్యాగును లాక్కునే విజువల్స్ బయటికి వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఇంట్లో దొరికిన డబ్బును సీజ్ చేసి బ్యాగును బయటికి తీసుకువస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేసి కొంత డబ్బును తీసుకెళ్లారని చెప్పారు. రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బులో 5 లక్షల రూపాయలను కొందరు ఎత్తుకెళ్లారని సీపీ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. రఘునందన్ రావు మామ, బంధువుల ఇళ్లలో పోలీసుల దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ చీఫ్ బండి సంజయ్ హుటాహుటిన సిద్ధిపేటకు వచ్చినా పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు. అయితే పోలీసులు తనపై దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ తొత్తుగా మారిన జోయల్ డేవిస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధిపేట వెళ్లి రఘునందన్ రావును పరామర్శించారు. పోలీసులు సోదాలు జరిగిన ఇంటిని పరిశీలించారు. సిద్ధిపేట పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రఘనందన్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు, బండి సంజయ్ పై దురుసు ప్రవర్తనకు నిరసనగా చలో ప్రగతి భవన్ కు పిలుపిచ్చింది బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా కమలం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను బీజేపీ కేంద్ర పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితులపై అరా తీసినట్లు చెబుుతున్నారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి రఘునందర్రావు ఉన్నట్లు తెలస్తోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్ వస్తున్నాయి. ఓటమి భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ చేయించిన సర్వేలో పూర్తిగా వెనకబడినట్లు తేలడంతో చిల్లర రాజకీయాలకు దిగారని మండిపడుతున్నారు. సిద్ధిపేట పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని సీపీ జోయల్ ను ఓపెన్ గానే హెచ్చరించారు అర్వింద్. మరోవైపు సిద్ధిపేట ఘటనపై టీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. మూడోసారి కూడా డిపాజిట్ దక్కదని భావించి రఘునందన్ కొత్త రాజకీయ నాటకాలకు తెరతీశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆయనపై నమ్మకం లేక గ్రామాల బీజేపీ కమిటీలకు కమిటీలే టీఆర్ఎ్సలో చేరుతున్నాయని చెప్పారు. దొంగ రాజకీయాలు చేస్తున్న రఘునందన్ ట్రాప్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ పడిపోయారన్నారు హరీష్ రావు. రఘునందన్ బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీస్ కమిషనర్ చెప్పారని చెప్పారు. దీనిపై వీడియో ఫుటేజీలు బయటపెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు హరీష్ రావు. రాజకీయ సానుభూతి కోసం రఘునందన్ నాటకాలు ఆడుతున్నారాని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయని.. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ ఇంట్లో పోలీసులు బెడ్ను చింపి మరీ సోదాలు చేశారని చెప్పారు. అంగీ, లాగులు చింపుకొని టీఆర్ఎస్ వాళ్లే చింపారని ఆరోపించే స్థాయికి బీజేపీ వాళ్లు వచ్చారని హరీశ్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించి పోలీసులు పట్టుకున్న డబ్బును లాక్కుపోయారన్నారు. తప్పు చేయనివారైతే పోలీసులకు సహకరించాలని సూచించారు హరీష్ రావు. పోలీసుల సోదాలు, డబ్బులు సీజ్, బీజేపీ ఆందోళనలు, టీఆర్ఎస్ కౌంటర్లతో దుబ్బాక రాజకీయ గరంగరంగా మారింది. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది.. పోలింగ్ నాటికి ఏం జరగబోతుందన్న ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే పోలీసులను ఉపయోగించి గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తుందో అనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. పోలీసుల సోదాలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది బీజేపీకి లాభించవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పుంజుకోవడంతో రెండు పార్టీలు డ్రామాకు తెర తీశాయని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/high-tension-in-dubbak-after-police-raid-at-bjp-candidate-raghunandan-raos-home-25-105607.html





