పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులకు షాక్
Publish Date:Jan 6, 2026
Advertisement
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల దేవస్థానం పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణకు రాగా.. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి (జనవరి 8)వాయిదా వేసింది. కాగా.. ఈ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్ఐ లక్ష్మీ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను పోలీస్ శాఖ వీఆర్కు పంపించింది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కుంటున్న వన్టౌన్ సీఐ విజయ్కుమార్పై కేసు నమోదు చేస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/high-court-shock-to-police-officers-36-212087.html





