పొంగుతున్న వాగులు, వంకలు..గోదావరి మహోగ్రరూపం
Publish Date:Jul 11, 2022
Advertisement
తెలంగాణను ముసురు కమ్మేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో ఎండ పొడ కనిపించనంతగా మబ్బులు కమ్మేశాయి. నింగినీ నేలనూ ఏకం చేస్తున్నట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి పునరావాస కేంద్రాలలో బస ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులూ, వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఇటీవలి కాలంలో జులై నెలలో ఈ స్థాయిలోవర్షాలు కురిసిన సందర్భం లేదని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ సహా పలు రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. వరద నీటిని ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో, అప్రమత్తతతో ఉండాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్ననేపథ్యలో ఆయన సోమవారం కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి , అంజయ్య యాదవ్ , కృష్ణ మోహన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, పీసిసిఎఫ్ డోబ్రియాల్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం వోఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతి నిధులకు ఫోన్ చేసి ఆరా తీశారు. వరద ముప్పు ఉన్న జిల్లాల అధికారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని.,గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం తగు సూచనలు చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీములు సహా హెలికాప్టర్ లను సిద్దం చేసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. ప్రాణహిత, ఇంద్రావతి, వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన పరిస్థితిలో రేపు కూడా భద్రాచలం లోనే వుండి పరిస్థితులను ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఫోన్లో ఆదేశించారు. వరంగల్, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు సీఎం ఆదేశించారు. గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్ధానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లకు సీఎం ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని సీఎం అధికారులను ఆదేశించారు
http://www.teluguone.com/news/content/heavy-rains-in-telangana-godavari-flood-at-bhadrachalam-39-139509.html





