గొరిల్లాను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారా..?
Publish Date:Jun 1, 2016
Advertisement
తల్లిదండ్రుల నిర్లక్ష్యం...అధికారుల తొందరపాటు ఒక మూగజీవం ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆ పాపమే ఇప్పుడు వారందరిని ప్రపంచం ముందు విలన్లుగా నిలబెట్టింది. ఎన్క్లోజర్లో పడిన నాలుగేళ్ల బాలుడిని కాపాడటానికి గొరిల్లాను చంపడమే ఇంతటి చర్చకు దారి తీసిన ఘటన. అమెరికాలోని ఓ జంట వీకెండ్ కావడంతో తమ ముద్దుల కొడుకును తీసుకుని సిన్సినాటిలోని ఓ జూకు వెళ్లారు. పిల్లాడికి జంతువులను చూపిస్తూ తాము ఆనందిస్తూ గడుపుతున్నారు. ఈ సమయంలో వారిద్దరూ కబుర్లలో పడిపోవడం..పిల్లాడిని పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారి పాకుకుంటూ వెళ్లి గొరిల్లాలుండే ఎన్క్లోజర్లోకి జారిపోయాడు. అంతే..జూలో ఒకటే అలజడి.. ఆ ఎన్క్లోజర్లో నాలుగు గొరిల్లాలున్నాయి. మధ్యలో వైరింగ్ ఉండటంతో మిగిలిన మూడు రాలేదు కానీ..ఓ భారీ గొరిల్లా మాత్రం చిన్నారి దగ్గరకొచ్చేసింది. దాని పేరు హరాంబే..వయస్సు 17 సంవత్సరాలు. చాలా పెద్ద శరీరంతో, వాడి చూపులతో చూస్తేనే భయమేసేలా ఉంది. ఇంతలో బాబు తల్లిదండ్రుల అరుపులు..జూలోని సందర్శకుల హాహాకారాలు..ఇంతలో ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అక్కడికి వచ్చింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని నిద్రపుచ్చవచ్చు. కాని ఆ మత్తు గొరిల్లాపై పనిచేయడానికి టైం పడుతుంది..ఈ లోగా అది బాబును గాయపరచడమే..చంపేయడమో చేస్తే..? ఇది ఆలోచించి మరో ఛాన్స్ లేకుండా మెషిన్ గన్స్కు పనిచెప్పారు. అంతే రెప్పపాటులో 100 బుల్లెట్లు గొరిల్లా శరీరాన్ని జల్లెడగా మార్చేశాయి. వెంటనే చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు జూ సిబ్బంది. జూ సందర్శకుల్లో ఒకరు జరిగిన సంఘటనను తమ మొబైల్లో చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడంతో ఈ ఘటన ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది..ఇంకా చేస్తూనే ఉంది. ఆ వీడియోలో గొరిల్లాకు బాబును చంపే ఉద్ధేశ్యం లేదని తెలుస్తోంది. ఎన్క్లోజర్లో పడిన పిల్లాడి కాలుని పట్టుకుని నీళ్లలో కూర్చోబెట్టింది. సందర్శకులు కేకలు పెడుతుంటే, మరోసారి చిన్నారిని లాక్కెళ్లి ఓ బండరాయిపై కూర్చుని బాబును చూస్తూ, వాడి తలను నిమురుతూ ఉండిపోయింది తప్ప ఎలాంటి హానీ చెయ్యలేదు. ప్రజలు అరుపులు ఎక్కువకావడంతో బాబును వారేమైనా చేస్తారేమోనని వాడికి రక్షణ కవచంలా నిలబడింది. చివరకు సెక్యూరిటి సిబ్బంది కురిపించిన బుల్లెట్లు తన శరీరాన్ని ఛిద్రం చేస్తున్నపుడు కూడా బాబు చెయ్యి అలాగే పట్టుకుని ప్రాణాలొదిలేసింది ఆ గొరిల్లా. తల్లిదండ్రులపైనా..జూ సిబ్బందిపైనా నెటిజన్లు విరుచుకుపడ్డారు. వీరి తీరును తప్పుబడుతూ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్కు 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. హరాంబే మరణానికి బాలుడి తల్లిదండ్రుల్ని బాధ్యులుగా చేసి వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
http://www.teluguone.com/news/content/harambe-the-gorilla-45-61410.html





