పోలీసుల ఆధ్వర్యంలో చౌమొహల్లా ప్యాలెస్లో ఇఫ్తార్ విందు
Publish Date:Mar 5, 2026
Advertisement
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఘనంగా ‘దావత్-ఎ-ఇఫ్తార్’ విందు జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చారిత్రక కట్టడం అయిన చౌమొహల్లా ప్యాలెస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం సమాజానికి ఆదర్శమని అన్నారు. రంజాన్ మాసం ప్రేమ, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర సమయమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ముస్లిం సంస్కృతి ప్రత్యేక గుర్తింపునిచ్చిందని, ఇక్కడి మత సామరస్యం దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సహకారంతోనే పోలీస్ వ్యవస్థ ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని సంపాదించుకుందని చెప్పారు. ప్రేమ, సోదరభావం, మానవత్వం హైదరాబాద్ నగరానికి అసలైన గుర్తింపని పేర్కొన్నారు. నగర చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా పోలీస్ డివిజన్ల పేర్లను మార్పులు చేయడం జరిగిందని కూడా వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఓర్పు, క్రమశిక్షణ, మానవీయ విలువలను బోధించే పవిత్ర కాలమని అన్నారు. హైదరాబాద్ గంగా-జమునీ తహజీబ్కు నిలయమని పేర్కొంటూ ముస్లిం సోదరులు పాటించే నియమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రాథమిక బాధ్యత అని, ప్రతి పౌరుడి భద్రత కోసం పోలీస్ యంత్రాంగం 24 గంటలు విధుల్లో ఉంటోందని చెప్పారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు పోలీసులకు, ప్రజలకు మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు పాల్గొని రంజాన్ మాసపు ఆధ్యాత్మిక సందేశాన్ని పంచుకున్నారు. నగరంలో శాంతి, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ముగిసింది.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనంగా నిలిచిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్యోన్యంగా కలిసి జీవించడం ఈ నగర ప్రత్యేకత అని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రంజాన్ మాసంలో ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ పోలీస్ విభాగం నిర్వహించే ఇఫ్తార్ విందు నగరంలోని గంగా-జమునీ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని అన్నారు.
http://www.teluguone.com/news/content/ftar-dinner-at-chowmohalla-palace-36-215085.html





