ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. లిక్కర్ అమ్మకాల సమయం పొడిగింపు..!
Publish Date:Jul 17, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలోని ఫుట్బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను అభిమానులు పెద్ద ఎత్తున వీక్షించేందుకు క్రీడాభిమానులు, వివిధ వాణిజ్య సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ప్రకటించింది. అర్జెంటీనా–స్పెయిన్ జట్ల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సోమవారం తెల్లవారుజామున 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి మ్యాచ్ ముగిసే వరకు మ్యాచ్ను బహిరంగంగా ప్రదర్శించాలనుకునే అన్ని వాణిజ్య, ప్రైవేట్ క్రీడా కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో అభిమానులు పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ను వీక్షించే అవకాశం లభించనుంది. అయితే ఈ సడలింపులు కేవలం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ దృష్ట్యా మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాచ్ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో అమలు చేసే భద్రతా నిబంధనల తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ పర్యవేక్షణ, చట్ట ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ప్రభుత్వ ఆదేశాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుట్బాల్ అభిమానులు ఉత్సాహంగా మ్యాచ్ను ఆస్వాదిస్తూనే బాధ్యతాయుతంగా వ్యవహరించి, చట్టాలను గౌరవించాలని ప్రభుత్వం, పోలీసులు విజ్ఞప్తి చేశారు. FIFA World Cup Final Match, Liquor sales time, Telangana Goverment,CM Revanth reddy,Argentina,Spain
http://www.teluguone.com/news/content/fifa-world-cup-final-match-36-226301.html





