ఫ్యాన్ స్విచ్ మళ్ళీ పీకే చేతికే!?
Publish Date:Mar 25, 2026
Advertisement
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. శకునిని అడ్డుపెట్టుకొని, జూదంలో పాండవులపై కౌరవులు పైచేయి సాధించినట్టుగా.. శకుని లాంటి రాజకీయ వ్యూహకర్త జిత్తులతో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది. అయినా ఫ్యాన్ పార్టీ తీరు మారలేదు. వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఆ శకుని లాంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటున్నారా? అక్కడికే వస్తున్నా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. 2024ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో అంటే 2019 ఎన్నికలలో తనకు అఖండ విజయాన్ని అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వైపు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మొగ్గు చూపుతున్నారని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి, మళ్ళీ పాత బంధాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 సీట్ల అద్భుత విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ పాదయాత్ర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే కీలక పాత్ర పోషించారు. అయితే, 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం, జగన్ కు దూరంగా జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల్లో జగన్ ఓటమిని పీకే ముందే ఊహించి ప్రకటించడం ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ వైసీసీ ఇసుమంతైనా కోలుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్ ఏపీకి విజిటర్ గా మాత్రమే వస్తూ ఎక్కువ కాలం బెంగళూరుకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ కూడా దాదాపు చెల్లాచెదరైన పరిస్థితి. ఉన్న కేడర్ లో సైతం నైరాశ్యం అలుముకుంది. ఇక అధికారంలో ఉన్నంత కాలం పార్టీ తరఫున గొంతును గట్టిగా వినిపించిన నేతలలో చాలా మంది ప్రస్తుతం సైలంట్ మోడ్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీని గాడిన పెట్టడానికి పటిష్ట వ్యూహాలు రచించాలంటే పీకేయే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఐప్యాక్ క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని జగన్ భావిస్తున్నారు. ఆ లోపాలన్నిటినీ సరిదిద్ధి క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే ప్రశాంత్ కిశోర్ వినా మరో గత్యంతరం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పీకేతో సంప్రదింపులు జరిపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేయడంలో పీకే అనుభవం తనకు ఉపకరిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనబడుతోంది. గతంలో పీకేపై జగన్ కొన్ని విమర్శలు చేశారు. అలాగే పీకే సైతం జగన్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గతం గత: అనుకుని మళ్లీ పీకేతో కలిసి ముందుకు సాగాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అది అంత సులభంగా జరిగే పని కాదని అంటున్నారు. గతంలో జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను పీకే విస్మరిస్తారా? అలాగే.. పీకే జగన్ రాజకీయ శైలిపై చేసిన వ్యాఖ్యలను జగన్ మరచిపోయి మళ్లీ చేతులు కలుపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఒక వేళ పీకే, జగన్ లు చేతులు కలిపినా.. 2019 నాటి మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సొంత రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకూ తన పార్టీ జనసురాజ్ పార్టీ అభ్యర్థులను నిలిపిన ప్రశాంత్ కిశోర్ కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేక బొక్కబోర్లా పడ్డ సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పీకే వ్యూహాలు పారే అవకాశాలు లేవంటున్నారు.
http://www.teluguone.com/news/content/fan-switch-back-in-pk-hands-electionstrtegist-prashantkishore-jaga-ycp-2029elections-39-216134.html





