అనర్హుల ఏరివేత తథ్యం.. కాంగ్రెస్ గ్యారంటీలపై కర్నాటక సీఎం డీకే
Publish Date:Jun 10, 2026
Advertisement
కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి ఇసుమంతైనా లేదని స్పష్టం చేస్తూనే.. అనర్హుల ఏరివేత తథ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాల ప్రయోజనాలు సజావుగా అందాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ నిధులను ఆదా చేయడం కంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని డీకే స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు. అలాగే.. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకంలో కూడా దుర్వినియోగం జరుగుతోందనీ, కొందరు ఉచిత విద్యుత్ను ఇళ్లకు కాకుండా దుకాణాలు, వ్యాపార సముదాయాల వంటి వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారనీ చెప్పిన ఆయన.. ఒకే వ్యక్తి పేరు మీద ఏకంగా 6 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు తనిఖీల్లో తేలిందనీ.. ఇలాంటి అనర్హుల ఏరివేత కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ తనిఖీల వల్ల అర్హులకు ఎలాంటి నష్టం జరగదని, కేవలం వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని డీకే చెప్పారు.
http://www.teluguone.com/news/content/elimination-of-ineligible-beneficiaries-certain-36-222519.html





