కాంగ్రెస్ అభ్యంతరాలు బేఖాతర్.. పరిమళ్ నత్వానీ నామినేషన్ ఆమోదం!
Publish Date:Jun 10, 2026
Advertisement
జార్ఖండ్ వేదికగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ చుట్టూ ఇప్పడు జాతీయ రాజకీయం తిరుగుతోంది. జార్ఖండ్ నుంచి ఎన్డీయే, మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిమళ్ నత్వానీ నామినేషన్ పై ప్రత్యర్థి వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ సహా జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్షిప్ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అక్రమాల నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. అయితే.. కాంగ్రెస్ కూటమి అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ.. రిటర్నింగ్ అధికారి రంజీత్ కుమార్ 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 36(2) ప్రకారం పరిమళ్ నత్వానీ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించడానికి ఎలాంటి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ పరిమళ్ నత్వానీ నామినేషన్ కు ఆమోదముద్ర వేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరలోనే ఈసీఐని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. జార్ఖండ్లోని మొత్తం 2 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ బరిలో జేఎంఎం తరపున వైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ తరపున ప్రణవ్ ఝా బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (జూన్ 11) తుది గడువు. ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం ఇండియా' కూటమికి ఒక రాజ్యసభ సీటు సులభంగా దక్కనుంది. కానీ, రెండో స్థానం కోసం పరిమళ్ నత్వానీ స్వతంత్రుడిగా బరిలో నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/congress-objections-disregarded-36-222520.html





