భారత్, చైనాపై విషం కక్కుతూ ట్రంప్ పోస్ట్
Publish Date:Apr 23, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేస్తోంది. భారత్, చైనాలను నరకకూపాలు అని సంబోధిస్తూ.. అక్కడి నుంచి వచ్చే ఐటీ నిపుణులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అని అభివర్ణించిన ఒక జాత్యహంకార పోస్ట్ను ట్రంప్ రీ పోస్ట్ చేశారు. గతంలో అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం అందించే విధానాన్ని విమర్శిస్తూ అమెరికా రేడియో వ్యాఖ్యాత మైఖేల్ పలు కామెంట్స్ చేశారు. భారత్, చైనా, ఇతర దేశాలు నరకప్రాయమని జాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా చైనా, భారత్ నుంచి కొందరు గర్భంతో ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో వచ్చి యూఎస్లో సంతానానికి జన్మనిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదో నెలలో వారు అమెరికా వచ్చి పిల్లల్ని కంటున్నారని, ప్రస్తుత చట్టం కారణంగా ఆ శిశువులు అప్పటికప్పుడు అమెరికా పౌరులు అయిపోతున్నారని ఆ రేడియో వ్యాఖ్యాత విమర్శించాడు. ఆ తరువాత వారు చైనా, భారత్, ఇతర నరకప్రాయ దేశాల నుంచి తమ కుటుంబాల్ని తీసుకొస్తున్నారని ఆరోపించాడు. బర్త్ టూరిజంతో ప్రస్తుత చట్టాల్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు. భారతీయులు, చైనా వారు లాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అని కూడా నోరుపారేసుకున్నారు. ఈ కామెంట్స్ను అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రీపోస్టు చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇక్కడ జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుంది. అయితే విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్ లేని కాలంలో రాసిన ఈ రాజ్యాంగం ప్రస్తుత కాలానికి సరిపడదని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి చట్టం లేదని ఆయన అంటున్నప్పటికీ, వాస్తవానికి కెనడా, మెక్సికో సహా సుమారు 36 దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికా సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ట్రంప్ వర్సెస్ బార్బరా కేసులో తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే అమెరికా తన గౌరవాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. మిత్రదేశంగా చెప్పుకునే భారత్ను ఇలా బహిరంగంగా కించపరిచేలా ఉన్న పోస్ట్ను స్వయంగా దేశాధ్యక్షుడే షేర్ చేయడంపై ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/donald-trumps-racist-post-36-218064.html





