తదుపరి లక్ష్యం ఇంటర్నెట్ కేబుల్స్.. ఇరాన్ సంకేతాలు!
Publish Date:Apr 23, 2026
Advertisement
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు సరికొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ముడి చమురు రవాణాకు అడ్డుకట్ట వేస్తామంటూ హెచ్చరిస్తున్న ఇరాన్.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చిది. సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న సంకేతాలను పంపుతోంది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థలల విశ్లేషణలు అదే చెబుతున్నాయి. ఈ కేబుల్స్ ను ఇరాన్ లక్ష్యం చేసుకుంటే.. గల్ఫ్ దేశాల డిజిటల్ వ్యవస్థ కుప్పుకూలే ప్రమాదం ఉంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ తో సంబంధం ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కేవలం చమురు, గ్యాస్ రవాణాకే కాకుండా.. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ జలసంధి గుండా కనీసం ఏడు ప్రధాన అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్స్ వెళ్తున్నాయి. వీటిలో ఫాల్కన్, ఏఈఈ-1, టీజీఎన్-గల్ఫ్, మరియు ఎస్ఈఏ ఎమ్ ఇ, విఈ వంటి అతిపెద్ద కేబుల్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ కేబుల్స్ ద్వారానే ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాల మధ్య ఇంటర్నెట్ డేటా వేగంగా ప్రవహిస్తుంది. ఒకేసారి పలు కేబుల్స్ దెబ్బతింటే లేదా కావాలని దెబ్బ తీస్తే.. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్రమైన ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దుబాయ్, దోహా వంటి నగరాల్లో స్టాక్ మార్కెట్లు స్తంభించిపోవడమే కాకుండా, ఈ-కామర్స్, బ్యాంకింగ్ లావాదేవీలు విమానయాన సేవలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ ఈ కేబుల్స్ ద్వారా ఇతర అరబ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు డిజిటల్ సేవల కోసం ఈ సముద్రగర్భ కేబుల్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. గతంలో ఎర్ర సముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిలో అటువంటి పరిస్థితే తలెత్తితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రాతితీవ్రమైన ప్రభావం చూపుతుంది. చమురు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవచ్చని, కానీ సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతింటే వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని, అంతవరకు డిజిటల్ సేవలు స్తంభించిపోతాయని తస్నీమ్ తన కథనంలో పేర్కొంది. రానున్న రోజుల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగితే.. ఇరాన్ ఈ కేబుల్స్ను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు గల్ఫ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేబుల్స్ భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది. మొత్తంమీద, హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కేవలం 'ఎనర్జీ చొక్ పాయింట్' గానే కాకుండా 'డిజిటల్ చొక్ పాయింట్' గా కూడా మారిపోయింది.
http://www.teluguone.com/news/content/-next-target-internet-cables-36-218051.html





