ప్రజల ఆగ్రహానికి కేంద్రం తలవంచక తప్పదు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Publish Date:Jul 25, 2026
Advertisement
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా నిర్ణయం వెలువడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అనేక రాజకీయ వర్గాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ప్రజల ఆగ్రహం, విద్యార్థుల పోరాటం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని ప్రతిపక్ష నేతలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను సరిదిద్దాలని కోరుతూ వీధుల్లోకి వచ్చి పోరాడిన ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థికి లభించిన చారిత్రాత్మక విజయంగా దీనిని అభివర్ణించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని తమ గళాన్ని బిగ్గరగా వినిపించిన లక్షలాది మంది యువతకు ఇది అసలైన విజయమని ఖర్గే పేర్కొన్నారు. అవినీతిమయంగా మారిన ఈ ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై తమ పిల్లల భవిష్యత్తును, ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలందరికీ ఇది లభించిన న్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంట్ ఉభయ సభల నుంచి రోడ్లపై నిరసనల వరకు ఐక్యంగా పోరాడిన ప్రతిపక్ష శక్తుల ఐక్యతకు దక్కిన విజయంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాల ముందు ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని ఖర్గే హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా ఈ పరిణామంపై ప్రత్యేకంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ ఎప్పటికీ తప్పించుకోలేరనే పచ్చి నిజాన్ని కేంద్రం అంగీకరించక తప్పలేదని శశి థరూర్ వ్యాఖ్యానించారు. తమ రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటూ శాంతియుతంగా నిరసన తెలిపిన వేలాది మంది యువ భారతీయులపై పోలీసులు ప్రయోగించిన క్రూరత్వానికి, బలప్రయోగానికి ఈ రాజీనామా ఒక నిరసన సమాధానమని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థ నాశనమవడం అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతీ పౌరుడు, ప్రతీ తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని ఆయన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యానికి దక్కిన చాలా పెద్ద విజయంగా అభివర్ణించారు. దేశంలోని కోట్లాది మంది యువత, విద్యార్థుల నిరంతరం సాగించిన సుదీర్ఘ పోరాటమే విద్యాశాఖ మంత్రిని దిగివచ్చేలా చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యువతకు, విద్యార్థి లోకానికి కేజ్రీవాల్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యువత ఐక్యంగా నిలబడితే ఎలాంటి అహంకార ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని, ఈ విజయం దేశ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు గళమెత్తుతున్నాయి. Dharmendra Pradhan Resignation, Opposition Reaction on Pradhan, Mallikarjun Kharge Statements, Shashi Tharoor X Post, Arvind Kejriwal Video, Education Ministry Controversy
http://www.teluguone.com/news/content/dharmendra-pradhan-resignation-36-227097.html





