ఆర్థిక వ్యవస్థ పై కరోనా దెబ్బ ...
Publish Date:May 26, 2021
Advertisement
లాక్ డౌన్ వలన కరోనా కాటు కొంత తగ్గుతుంది. ప్రజల ప్రాణాలకు కొంత భరోసా ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం క్షీణిస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్’లో అదే జరిగింది. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్’లోనూ అదే జరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఇతర ఆంక్షలు విధించాయి. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, (2021-22) తొలి త్రైమాసికంలో, దేశ ఆర్థిక వ్యవస్థ సుమారు రూ. 5 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే, ఇది గత సంవత్సరం తొలి త్రైమాసికంలో సంభవించిన నష్టం, రూ. 11లక్షల కోట్లలో సగానికంటే కూడా కొంచెం తక్కవ. గత సంవత్సరం, కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, ఇతర ఆంక్షలు విధించింది. ఈ సారి, స్థానిక పరిస్థితి ఆధారంగా ఆంక్షలు విధించే అధికారాన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వదిలివేయడంతో, ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావ భారం కొంత తగ్గింది. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన నివేదిక ప్రకారం, ప్రస్తుత త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ. 6 లక్షల కోట్లుగా అంచాన వేశారు.బార్క్లేస్ అంచనా ప్రకారం, ఇది రూ.5.4 లక్షల కోట్లు. ఎస్బీఐ, బార్క్లేస్ అంచనాల ప్రకారం వాస్తవ జీడీపీ వృద్ధి 10 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. అయితే ఇది 26.2 శాతం ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, భయపెడుతున్న విధంగా కొవిడ్ థర్డ్ వేవ్’ కూడా వస్తే వృద్ధి రేటు ఇంకా దిగజారి పోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అదే జరిగితే మరో రూ.3 లక్షల కోట్లు నష్టపోవలసి వస్తుందని, ఫలితంగా వార్షిక వృద్ధి రేటు దాదాపు 3 శాతం తగ్గుతుందని, సుమారు 8 శాతానికి పరిమితమవుతుందని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్’కు కొంత ముందు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు 10 నుంచి 12 శాతంగా ఉండేవి. ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే, రెండో ప్రభంజనం ప్రభావం వాస్తవ ఆర్థిక వ్యవస్థపై పరిమితంగా ఉంటుందని మొదట్లో భావించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామినల్ జీడీపీ నష్టం రూ.6 లక్షల కోట్ల వరకు ఉండవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి.2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్ల నష్టం జరిగింది. వాస్తవ జీడీపీ నష్టం రూ.4.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ అష్ట దిగ్బంధనాలు జూన్ నెలాఖరు వరకు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమైతే, 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.5.4 లక్షల కోట్ల మేరకు నష్టం జరగవచ్చు. మూడో ప్రభంజనం కూడా వస్తే, దాదాపు ఎనిమిది వారాల పాటు అష్ట దిగ్బంధనం అమలు చేస్తే, మరొక రూ.3.1 లక్షల కోట్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/covid-effect-on-financial-system-39-116309.html





