ఎన్నికల సన్నాహాలలో కాంగ్రెస్- వనరుల లేమితో పరేషాన్
Publish Date:May 11, 2022
Advertisement
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయి.. దేశం మొత్తంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ. తమ ప్రమేయం లేకుండానే ఏదో విధంగా మళ్లీ కేంద్రంలో అధికారం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్న గాంధీ కుటుంబం నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. అయితే పార్టీ ఎలాగోలా అధికారంలోకి వచ్చేస్తుందని హైకమాండ్ కున్న నమ్మకం.. పార్టీలోని సీనియర్లలో లేకపోవడంతో చాలా వరకూ సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో నిరాశా నిస్షృహలు పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికల సన్నాహాలకు వనరుల లేమితో పరేషాన్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనివార్యంగా పార్టీలో ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఉదయపూర్ చింతన్ శిబిర్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆమె అధ్యక్షతన సీడబ్ల్యుసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సోనియా ప్రసంగమే దేశ రాజకీయాలలో పెద్ద చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పనైపోయిందా అన్న అనుమానాలకూ తెరతీసింది. పార్టీ పునర్వైభవానికి పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాల్సిన అధినేత్రి సోనియా గాంధీ సీడబ్ల్యుసీ లో బేలగా ప్రసంగించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ వల్ల దేశంలో అందరూ లాభపడ్డారనీ.. అలా లాభపడిన వారంతా ఇప్పుడు పార్టీ కోసం తమ వంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందని సోనియా ఆ సమావేశంలో పిలుపు నిచ్చారు. నేరుగా చెప్పకపోయినా.. కాంగ్రెస్ ను అడ్డుపెట్టుకుని సంపాదించిన వారంతా ఇప్పుడు పార్టీకి ఆర్థిక సహకారం అందించాలన్నదే ఆ పిలుపు లక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో కేవలం రెండంటే రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఈ పరిస్థితుల్లో క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి వారిని వచ్చే ఎన్నికలలో క్రియా శీలంగా పని చేసేలా దిశానిర్దేశం చేయాల్సిన అధినేత్రి బేలగా.. పార్టీని ఆదుకోవడానికి ముందుకు రండి అంటూ అభ్యర్థించడం పై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో దశ, దిశ చూపే నాయకత్వం కరవైందనడానికి సీడ్బ్ల్యుసీలో సోనియా ప్రసంగమే నిదర్శనమంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాలలో జరిగే చింతన్ శిబిర్ వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చని విశ్లేషణలు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-chintan-sibir-from-friday-25-135763.html





