తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్
Publish Date:Dec 8, 2013
Advertisement
ఈరోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టువంటివని చెప్పక తప్పదు. గత పదేళ్ళకాలంలో వరుస పెట్టి వెలుగు చూస్తున్నకుంభకోణాలతో తన ప్రతిష్ట మసకబారుతున్న సంగతి గ్రహించి వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకొనే బదులు, వాటిని కప్పి పుచ్చుకొంటూ ప్రతిపక్షాలపై ఎదురు దాడిచేయడంతో కాంగ్రెస్ పట్ల ప్రజలలో క్రమంగా చులకన భావం పెరుగుతూ వచ్చింది. అదికాక పెరిగిన ధరలు. అత్యాచారాలు, అరాచక వ్యవస్థ, ఉగ్రవాద దాడులు తదితర అనేక అంశాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. సరిగ్గా అదును చూసి బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని ప్రకటించి, ఆయనకి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ ఓటమి పూర్తిగా ఖయమయిపోయింది. ఒకవేళ బీజేపీ మోడీకి బాధ్యతలు అప్పగించడానికి ఇంకా సంకోచిస్తూ ఉండి ఉంటే, బహుశః కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా పెరిగి ఉండేవి. బీజేపీ ఇదే ఊపును, ఐఖ్యతను వచ్చే సాధారణ ఎన్నికల వరకు కొనసాగించగలిగితే, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పక పోవచ్చును. ఈసారి ఎన్నికలలో రాష్ట్రాల వారిగా గెలుపోటములకు గల కారణాలు పరిశీలిస్తే, యావత్ దేశాన్ని కుదిపేసిన రెండు ముఖ్యమయిన సంఘటనలు డిల్లీలో కాంగ్రెస్ పరాజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చును. మొదటిది డిల్లీలో అన్నాహజారే నేతృత్వంలో జనలోక్ పాల్ బిల్లుకోసం జరిగిన ఉద్యమం, రెండవది నిర్భయ ఉదంతం. నేటికీ జన లోక్ పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో నిందితులకు కటిన శిక్షలు పడలేదు. ఈ రెండూ కూడా డిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పట్ల విముఖతను పెంచాయి. అంతే గాక పెరిగిన ఉల్లి ధరలు డిల్లీ ప్రజలను కంట తడిపెట్టిస్తే ప్రభుత్వం ఎటువంటి దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదు. అందుకే ఇప్పడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బోరుమని విలపించేలా బుద్ధి చెప్పారు. రాజస్తాన్ లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్ళలో ప్రజలను ఆకట్టుకోలేక పోయింది. రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల చేసిన పోరాటాల పట్ల కాంగ్రెస్ ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి, అధిక ధరలు, కుల సమీకరణాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. అదికాక ప్రజలలో అధికారపార్టీ పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేఖత కూడా ఓటమికి కారణమని చెప్పవచ్చును. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రజలలో మంచి పేరే ఉంది. ఆయన బడుగు బలహీన వర్గాలకోసం చెప్పటిన అనేక పధకాలు, వ్యవసాయ అభివృద్ధి పట్ల కనబరచిన ప్రత్యేక శ్రద్ధ ఆయన విజయానికి దోహదపడ్డాయి. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన పూర్తి శ్రద్ధ కనబరచకపోవడం వలన రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరిగినట్లు కనబడదు.అయినప్పటికీ ప్రభుత్వం చెప్పటిన సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతుండటం వలన ప్రజలు మళ్ళీ బీజేపీకే పట్టం కట్టారు. ఛత్తీస్ ఘర్ రాష్ట్రం కూడా బీజీపీ పరిపాలనలోనే ఉంది. కానీ అక్కడ నక్సల్స్ ప్రభావం చాలా విపరీతంగా ఉండటంతో తరచూ వారి దాడులలో అనేక మంది ప్రజలు, పోలీసులు, చివరికి రాజకీయ నాయకులు కూడా మరణించారు. నక్సల్స్ ని సమర్ధంగా అణచివేయలేక పోవడం వలన వారి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. నక్సల్స్ అణచివేతలో ప్రభుత్వ వైఫల్యం, ఆశించినంతగా అభివృద్ధి జరగకపోవడం వలన అక్కడ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. కానీ తాజాగా విడుదలయిన ఫలితాలలో మళ్ళీ బీజేపీ బలం పుంజు కొని 37 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ (34)ని వెనక్కి నెట్టి ఆదిక్యతలోకి వచ్చింది. రేపు వెలువడనున్న మిజోరం ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. దేశంలో కీలకమయిన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో ప్రాంతీయ పార్టీ స్థితికి చేరుకొన్న కాంగ్రెస్ పార్టీకి పతనం ఆరంభమయిందని భావించవచ్చును. వచ్చేసాధారణ ఎన్నికల తరువాత కేంద్రంలో ఎలాగయినా అధికారం సంపాదించాలనే దురాశతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూనుకొని దక్షిణాదిన తనకు కంచుకోట వంటి రాష్ట్రాన్ని చేజేతులా తన రాజకీయ ప్రత్యర్ధుల చేతికి అప్పగించి మరో ఘోర తప్పిదం చేసింది. అందువల్ల ఈ తప్పులకు, పొరపాట్లకు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ప్రాయశ్చితం చేసుకోక తప్పదు.
http://www.teluguone.com/news/content/congress-37-28193.html