బ్లాక్ మనీని బ్లాక్ చేయటానికి బాబుగారిచ్చిన ఐడియా ఏంటి?
Publish Date:Oct 13, 2016
Advertisement
బ్లాక్ మనీ... ఈ పదం అందరి నోటా వినిపిస్తుంది కాని... ఎక్కడా కనిపించదు. కారణం, నల్లధనం నిజంగా నల్లగా వుండదు. మామూలు రంగులోనే వుంటుంది! మీరు ఎవరికైనా ఇచ్చి ఏదైనా కొనుక్కోవచ్చు. అక్కడే వస్తుంది వున్న తంటా అంతా...
బ్లాక్ మనీ తిరిగి తీసుకొచ్చి దేశ ఆర్దిక స్థితినే మార్చేస్తానని మోదీ ఎన్నికలకు ముందు అన్నారు. కాని, ఇప్పుడు అలాంటి సూచనలు ఏం కనిపించటం లేదు. ఇందులో మోదీ నిస్సహాయత వుంటే వుండొచ్చుగాని... అసలు సమస్య నల్లధనంలోనే వుంది. అది దేశం లోపల వున్నా బయట వున్నా గుర్తించటమే పెద్ద సవాలు. ఏది నల్లదనం, ఏది కాదు అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారం. సింపుల్ గా మాట్లాడుకుంటే ఎవరైనా ట్యాక్స్ కట్టకుండా తమ డబ్బు దాచేస్తే అది బ్లాక్ మనీ అవుతుంది. కాని, మనం మాట్లాడుకున్నంత సింపుల్ గా బ్లాక్ మనీని బయటకు తీయించలేం. నల్లదనం దాచేవాడి దగ్గర బోలెడు టెక్నిక్స్ వుంటాయి...
నల్లధనం గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తుంటాయి. అసలు దేశంలో అత్యంత ఎక్కువ నల్లధనం మన నేతలే దాచేశారని టాక్. అందుకే, బ్లాక్ మనీని తీసుకురావాల్సిన వాళ్లే దొంగ సాకులు చెబుతూ తీసుకురాకుండా వుండిపోతుంటారు. ఆఫ్ట్రాల్ సీరియస్ గా తీసుకుని బ్లాక్ మనీ తవ్వి తీస్తే నష్టపోయేది పొలిటీషన్సే! మరి వాళ్లెందుకు చేస్తారు?
మొత్తంగా బ్లాక్ మనీ ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు దేశంలోని పేదలు బాగుపడతారో మనకు తెలియదు గాని ... ఇప్పటికిప్పుడు నల్లదనం నియంత్రణ, మరింత ఎక్కువగా స్విస్ బ్యాంకులకి తరలకపోవటం వంటివి మాత్రం చేయవచ్చు. అందుకు చక్కటి పరిష్కారం ఏపీ సీఎం చంద్రబాబు పీఎంకి సూచించారు. ఆయన రాసిన లేఖలో నరేంద్ర మోదీకి అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు నిషేధించమని చెప్పారు. అలా చేస్తే బ్లాక్ మనీ సర్క్యూలేషన్ కష్టంగా మారుతుందని ఆయన వివరించారు. ఇలాంటి సూచన గతంలోనూ చాలా మంది చేశారు. బాబా రాందేవ్ యూపీఏ హయాంలోనే ఇలాంటి ఐడియా ఇచ్చారు. కాని, అది ఇప్పటి వరకూ వర్కవుట్ కాలేదు. అయితే, చంద్రబాబు లాగా ఒక సీఎం ప్రధానికి బ్లాక్ మనీ అంశంపై లేఖ రాయటం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. చూడాలి మరి... చంబ్రాబు సలహాని, సూచనని మోదీ ఎంత వరకు స్వీకరిస్తారో! బ్లాక్ మనీని ఏ రేంజ్లో బ్లాక్ చేస్తారో...
http://www.teluguone.com/news/content/chandra-babu-45-67744.html





