తప్పులెన్నడమే కాదు.. కేంద్రం తన తప్పులూ గుర్తించాలి!
Publish Date:Jul 21, 2022
Advertisement
కేంద్రం తన అధికార పరిధిని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కుదించుకుని మరీ రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ ఇష్టారీతిన అప్పులు చేయడానికి అనుమతులు ఇచ్చేసింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణ కూడా ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని అతిక్రమించి పరిమితికి మించి అప్పులు చేసింది. అది కూడా కేంద్రం చలవే. ఎందుకంటే రాష్ట్రాల అప్పులను నియంత్రించాల్సింది కేంద్రమే. ఆ బాధ్యతను గాలికొదిలేసి రాష్ట్రాలు యథేచ్ఛగా.. వచ్చే ఎన్నికలలో విజయం వ్యూహింగా ఉచిత పథకాల కోసం అభివృద్ధిని, ఉత్పాదకతను కూడా ఫణంగా పెట్టి అప్పులు చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నకేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేసి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం. నిజమే శ్రీలంక పరిస్థితులు ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించేవిగానే ఉన్నాయి. అధికారంలో ఉండటమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వాలు సంక్షేమం అంటూ ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు.. మీ అవసరాలన్నీమేమే తీరుస్తాం అంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తుంటే ఏం జరుగుతుందో శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేశాయి. తెలగు రాష్ట్రాల అడ్డగోలు అప్పుల వెనుక కేంద్రం బాధ్యత కాదు కాదు కేంద్రం తప్పు కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్ల రాష్ట్రపతి ఎన్నికలో అవసరం కనుక ఏపీ కోరడమే ఆలస్యం అప్పులకు అనుమతులిచ్చేసిన కేంద్రం.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి కొంత ఇబ్బందులు పెట్టినా.. ఆ రాష్ట్రంలో అధికారంపై కన్నేసింది కనుక చివరికి మేం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తున్నాం అని చెప్పుకోవడానికి అభ్యంతరాలు చెబుతూనే అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తప్పులన్నీ అటకమీద దాచేసి ఇప్పుడు ఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలకు అప్పుల మీద క్లాస్ తీసుకోవడం ఏ విధంగా చూసినా సబబు కాదు. ముందు అద్దంలో చూసుకున్న తరువాతే ఎదుటి వారి అందంపై కామెంట్లు చేయాలి. కేంద్రానికి మాత్రం ఆ అలవాటు లేదు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరన్నట్లు ఎంత సేపూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల తప్పులెన్నడంతోనే మోడీ సర్కార్ కు కాలం గడిచిపోతోంది. తెలుగు రాష్ట్రాల పరిమితి లేని అప్పులతో భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నా చూస్తూ కూర్చున్న మోడీ సర్కార్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పబ్బం గడిచిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రాలపై నెపం నెట్టేయడానికి చూడటం దారుణమని వివిధ రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. రాష్ట్రాల అప్పులపై అఖిల పక్షంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ముందే మోడీ రాష్ట్రాల ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో మోడీ సర్కార్ కళ్లు మూసుకుందా? స్వయంగా కేంద్రం ప్రకటించిన ఉచితాల సంగతి మాట్లాడకుండా.. ఇప్పుడు పరిస్థితి విషమించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడం, జనంలో అసహనం పెరుగుతున్న చ్ఛాయలు కనిపించడంతో మోడీ సర్కార్ తనను తాను రక్షించుకోవడానికి రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు. నిజమే ఏపీ వంటి రాష్ట్రాలు వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నాయి. దానిని నియంత్రించాల్సిన కేంద్రం ఇంత కాలం ఎందుకు మిన్నకుంది. రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే…అందుకు ముందుగా తప్పుపట్టాల్సింది కేంద్రాన్నే. శ్రీలంక పరిస్థితులను బూచిగా చూపి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చి ఊరుకుంటే చేసిన తప్పిదాలు సమసిపోవు. ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.
http://www.teluguone.com/news/content/center-main-culprit-in-states-over-debts-39-140218.html





