బుమ్రా ఆరోగ్యంపై వదంతులు.. ఖండించిన ఇండియన్ పేస్ బౌలర్
Publish Date:Jan 16, 2025
Advertisement
ఇండియన్ స్టార్ పేస్ బౌలర్ బుమ్రా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించాడు. చాంపియన్ ట్రోఫీకి ముందు తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని బుమ్రా కొట్టి పారేశారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, యూఏఈలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై సందేహాలు లేవనెత్తుతూ… అతడు ఇంటికే పరిమితం కానున్నాడంటూ బుధవారం (జనవరి 15) మీడియాలో కథనాలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమేనని ఆ కథనాలు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన బుమ్రా తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అదంతా నిరాధార ప్రచారమని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా అర్ధంతరంగా ఫీల్డింగ్ నుంచి వైదొలిగాడు. ఆ తరువాత జరగనున్న ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని ఛాంపియన్స్ ట్రోఫీకీదూరమవుతాడని ప్రచారం జరిగింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 32 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అలాగే బుమ్రా డిసెంబర్ 2024కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నాడు. డిసెంబర్ లో మొత్తం మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. అటు ఐసీసీ అవార్డ్స్ 2024లో ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు.
http://www.teluguone.com/news/content/bumra-condemn-roumers-on-his-health-25-191369.html





