కొడుకును విచారణకు పంపండి...బండి సంజయ్కు సీఎం సూచన
Publish Date:May 15, 2026
Advertisement
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ హుందాగా వ్యవహరించే బాధ్యత కలిగి ఉన్నారని, తన కుమారుడిని స్వచ్ఛందంగా విచారణకు అప్పగించాలని సీఎం కోరారు.మే 8న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. అనంతరం ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. మే 11న మైనర్ బాలిక నుంచి స్టేట్మెంట్ నమోదు చేసిన తర్వాతే పోక్సో కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. “గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన వారు, ఇప్పుడు అదే గడీల కోసం పని చేస్తున్నారు” అని విమర్శించారు. బాలికకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర ఆధారాలు సేకరించామని, తగిన ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఎం తెలిపారు. “గతంలో కేసీఆర్ తనపై కేసులు పెట్టినట్లుగా మేము హడావుడిగా వ్యవహరించడం లేదు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం” అని అన్నారు. కేంద్రమంత్రి అయినా, మరెవరైనా అయినా బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం” ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
“మాకు ఎవరైనా ఒక్కటే. నేరం చేసిన వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తల్లి ఫిర్యాదుకంటే మైనర్ బాలిక స్టేట్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం” అని సీఎం పేర్కొన్నారు. ఈ కేసును ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేసిన సీఎం, “బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదైతే బండి సంజయ్ను అరెస్ట్ చేయాలా?” అంటూ ప్రతిపక్ష విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం, పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/bandi-bhagirath-36-219926.html





