గ్రూప్ వన్ మూల్యాంకన తప్పుల తడక.. కోర్టుకు నివేదిక సమర్పించిన సిట్.!
Publish Date:Aug 12, 2026
Advertisement
ఏపీలో వైకాపా హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సిట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు బృందం, మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలను, సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా ధర్మాసనం ముందుంచింది. సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన సాగిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థులలో 160 మంది జవాబు పత్రాలలో మార్కులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరిగాయని సిట్ తేల్చింది. అలాగే ఎంపిక కాని 161 మందికి సంబంధించి 153 మంది పేపర్లలోనూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 405 మంది రిట్ పిటిషనర్ల జవాబు పత్రాలలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ఫోరెన్సిక్ తనిఖీలలో చీఫ్ ఎగ్జామినర్లు నేరుగా మార్కులను దిద్దడం, మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు రాతపూర్వక ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. దర్యాప్తు సమయంలో 61 జవాబు పత్రాల స్లిప్పులపై వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దీనికి తోడు భద్రంగా ఉంచాల్సిన పరీక్ష పత్రాలను 84 రోజుల పాటు విజయవాడ సమీపంలోని ఒక రిసార్ట్లో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం మూల్యాంకనం కోసం అందుబాటులో ఉంచాల్సిన 452 మంది అర్హులైన నిపుణుల ప్యానెల్ను పూర్తిగా పక్కనబెట్టి, 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల సహాయంతోనే ఈ మూల్యాంకన ప్రక్రియను నడిపించారని సిట్ పేర్కొంది. మూడోసారి అనధికారికంగా మూల్యాంకనం జరిపేందుకు కొత్తగా బార్కోడ్ షీట్లను ప్రత్యేకంగా ముద్రించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒకసారి మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇలా మళ్లీ మళ్లీ పేపర్లను దిద్దడం చట్టవిరుద్ధమని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి హైకోర్టుకు అందజేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. సుమారు 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, మిగిలిన కొద్దిమంది నివేదికలను త్వరలోనే అందజేస్తామని సిట్ పేర్కొంది. కాగా అభ్యర్థుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సిట్ సమర్పించిన నివేదిక ప్రతులను తమకు అందించాలని కోర్టును కోరారు. దానికి అంగీకరించిన హైకోర్టు బెంచ్, నివేదిక ప్రతులను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. APPSC Group 1 Evaluation Irregularities, AP High Court Group1, SIT Report, AP High Court, Andhra Pradesh SIT Report, TeluguOne
http://www.teluguone.com/news/content/appsc-group-1-evaluation-irregularities-36-228771.html





