వైసీపీలో పీక్స్ కు చేరిన ఫస్ట్రేషన్..
Publish Date:May 30, 2022
Advertisement
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారపీఠం ఎక్కి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గానీ, వైసీపీ సర్కార్ కానీ ప్రజల కోసం చేసిందేమీ లేదు, సాధించింది కూడా ఏమీ లేదనేది జనం నుంచి తీవ్రంగా వస్తున్న విమర్శ. అయినప్పటికీ ఏదో పొడిచేశామనే ఫీలింగ్ మాత్రం జగన్ అండ్ కోలో ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. అనాలోచిత, అనుభవం లేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడమే కాకుండా.. ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించలేక చతికిలపడిన విషయం జనానికి బాగానే అర్థం అవుతోంది. దీంతోనే మూడేళ్లలోనే జనంలో వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఎక్కడ చూసినా ప్రజల నుంచి నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. ‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు చేసిన బస్సు యాత్ర తుస్సు మంది. వైసీపీ మంత్రులు ఎక్కడ సభ పెట్టినా జనానికి కూలి ఇచ్చి మరీ తెప్పించుకున్నా.. ప్రసంగాలు ప్రారంభం అయ్యే సమయానికే సొమ్ములిచ్చి మరీ తీసుకువచ్చిన జనం పొలోమంటూ లేచి వెళ్ళిపోయారు. మరో పక్కన టీడీపీ కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. బాదుడే బాదుడు, మహానాడు కార్యక్రమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. వైసీపీ పాలనపై తమ వ్యతిరేకతను, నిరసనను జనం బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ కార్యక్రమాలకు వచ్చేందుకు ఇష్టపడకపోవడం, ఇటు టీడీపీ ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ చేయడమే దీనికి తాజా ప్రత్యక్ష నిదర్శనం. దీంతో సీఎం జగన్ సహా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, నేతల్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. మొన్నా మధ్యన సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తన ఫ్రస్టేషన్ ను బహిరంగంగా వెళ్లగక్కేసారు. దీంతో ఆయన మంత్రివర్గ సహచరులు, మాజీ మంత్రులూ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ ను దాచుకునే కనీస మర్యాదను, విలువలను పాటించడం లేదు. తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో తన ఫ్రస్టేషన్ ను బయటపెట్టుకున్నారు. సభ జరుగుతుండగా ఓ మీడియా ప్రతినిధిపై విరుచుకుపడుతూనే అవంతి శ్రీనివాసరావు.. అక్కడే ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ పై నోరు పారేసుకోవం ఇందుకు నిదర్శనం‘నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు.. నీ సంగతి చూస్తానం’టూ అవంతి తనలో ఉన్న ఫ్రస్టేషన్ వెళ్లగక్కారు. తాజాగా మంత్రుల ‘సామాజిక న్యాయ భేరి’ బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి వెళ్తూ మంత్రి బొత్స సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు బస్సుదిగి వెళ్ళారు, ఆ సమయంలొ అడ్డొచ్చిన ఓ డఫేదారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక చైతన్య బస్సు యాత్రలో వైసీపీ మంత్రులు ప్రతి చోటా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవడంపైనే దృష్టి సారించడం ఏంటనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. రాజకీయంగా విమర్శిస్తే సరేసరి.. కానీ వ్యక్తిగతంగా ‘చంద్రబాబు మెదడు చితికిపోయింది’ లాంటి విమర్శలు చేయడమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఏపీ ప్రజల బాగు కోసం తాము చేసిందేమిటో చెప్పుకోలేని వైసీపీ నేతలు ప్రతిపక్ష తెులుగుదేశం నేతలను, ఆ పార్టీ కార్యక్రమాలను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిగా వ్యఖ్యలు, విమర్శలు చేస్తూ తమ లోని ఫ్రస్టేషన్ బయటపెట్టుకుంటున్నారు. ఒంగోలులో జరిగిన మహానాడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. పనిలో పనిగా చంద్రబాబును ఆయన టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం తమలోని అసహనాన్ని కాస్తయినా చల్చార్చుకోవడానికే నని పరిశీలకులు ఉంటున్నారు. మహానాడును ‘ఏడుపునాడు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించినా.. ‘చంద్రబాబుది అబద్ధాల ఏడుపు’ అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నా.. అదంతా వారిలో పెరిగిపోతున్న ఫ్రస్టేషనే అంటున్నారు. ఒటమి భయమే వారిలో ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటపడుతోందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-ycp-leaders-frustration-tp-peaks-39-136695.html





