ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..!
Publish Date:Jul 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముగ్గురిని ఏసీబీ అధికారులు పీటీ వారెంట్పై తమ అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాదుకు వచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు వాసుదేవ్ రెడ్డి, కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కరుమూరి సునీల్ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని వరుసగా మూడు రోజుల పాటు విస్తృతంగా విచారించిన అనంతరం నిన్న ఈ ముగ్గురిని కోర్టు ముందు హాజరు పరచి, జైలుకు తరలించారు. అయితే ఆ విచారణలో లభించిన సమాచారం, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, ఇతర కీలక అంశాల ఆధారంగా ఇప్పుడు ఏపీ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందిన ఏసీబీ అధికారులు జైలుకు వెళ్లి ముగ్గురిని అధికారికంగా తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వారిని విజయవాడకు తరలించారు. లిక్కర్ పాలసీ అమలు, టెండర్ల కేటాయింపు, నిధుల ప్రవాహం, వివిధ సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు ఏపీ ఏసీబీ సేకరించిన ఆధారాలను సమన్వయం చేస్తూ కేసును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో మరికొందరి పాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశ ముందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. AP Liquor Scam Case, ACB officials, Vasudev Reddy, Kasireddy Rajasekhar Reddy, Karumuri Sunil, Liquor Policy, CM Chandrababu, Naralokesh, YS Jagan,Vijayawada ACB Court
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-case-36-226494.html





