సీఐడీ చీఫ్ సునీల్కు హైకోర్టు నోటీసులు.. రఘురామ దెబ్బ మామూలుగా లేదుగా..
Publish Date:Jan 31, 2022
Advertisement
ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన అంటున్నారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడారు. ఇదంతా సీఐడీ చీఫ్ సునీల్కుమార్ డైరెక్షన్లో జరిగిందనేది రఘురామ ఆరోపణ. జగన్ కళ్లలో ఆనందం కోసమే సునీల్ తనను టార్చర్ చేశారనేది ఆయన వర్షన్. ఇక, అప్పటి నుంచీ రఘురామ వర్సెస్ సీఐడీ చీఫ్ ఎపిసోడ్ నాన్స్టాప్గా కొనసాగుతోంది. ఛాన్స్ చిక్కిన చోటల్లా సునీల్ కుమార్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు రఘురామ. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చారు. లేటెస్ట్గా.. ఏపీ హైకోర్టులోనూ సునీల్కుమార్పై పిటిషన్ ఫైల్ చేశారు. వదల బొమ్మాళీ అంటూ.. సీఐడీ బాస్ను వేటాడేందుకు వెంటాడుతున్నారు రఘురామ. తాజాగా, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సునీల్ కుమార్పై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ కుమార్ వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని తెలిపారు. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ పిటిషన్లో ప్రస్తావించారు. సునీల్ దంపతుల మధ్య వివాదాల్లో తనను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్ను ఏపీ హైకోర్టు ఆదేశించారు. ఇటీవల ‘‘నన్ను హత్య చేయడానికి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రోద్బలంతో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కుట్ర పన్నారు. నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేయించడానికి జార్ఖండ్కు చెందిన గూండాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సీఐడీ చీఫ్తో పాటు సీఎం నుంచీ నాకు ప్రాణ హానీ ఉంది’’ అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/ap-high-court-issued-notice-to-cid-chief-suneel-kumar-39-130997.html





