రాజధాని అక్కడే నిర్మించనున్నారా?
Publish Date:Jul 15, 2014
Advertisement
రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ ఈ విషయంపై చంద్రబాబుతో సహా అందరూ మౌనం పాటించడం మొదలుపెట్టారు. రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చంద్రబాబును కలిసిన తరువాత నుండే ఈ మార్పు వచ్చింది. అంటే కమిటీ సభ్యులు అక్కడ రాజధాని నిర్మాణం వల్ల ఏమయినా పెద్ద ఇబ్బందులు వస్తాయని చెప్పారా? లేక ఇంతకంటే మంచి ప్రాంతం ఆయనకు సూచించారా? లేక ప్రస్తుతం కృష్ణా జలాల కోసం పడుతున్న తిప్పలు చూసి, అక్కడ రాజధాని నిర్మిస్తే రాజధానికి అవసరమయిన 12 టీ.యం.సి.ల నీళ్ళు లభ్యమవ్వవనే ఆలోచనతో వెనకడుగు వేస్తున్నారా? లేక కేంద్రం నిధులు మంజూరు చేయకుండా పనులు మొదలు పెట్టడం మంచిది కాదని ఆగుతున్నారా? ఆ కారణంగా ఆలస్యమవుతుంటే విజయవాడ-గుంటూరు మధ్య భూముల ధరలకు రెక్కలు వస్తున్నందున వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? లేక ఇతరత్రా వేరే ఏవయినా కారణాలు ఉన్నాయా? అనే సంగతి ఎవరికీ తెలియక పోవడంతో ప్రజలలో ముఖ్యంగా విజయవాడ-గుంటూరు ప్రాంతాల ప్రజలలో రాజధాని విషయంపై చాల గందరగోళం నెలకొని ఉంది. ఇటీవల విజయవాడలో ఏపీయన్జీవోలు నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తప్ప అక్కడే రాజధాని నిర్మిస్తానని ఇదివరకులా ఖచ్చితమయిన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఈ నిశబ్దాన్ని బ్రద్దలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చూచాయగా తెలిపారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాల చుట్టూ దాదాపు 180కిలోమీటర్ల పరిధిలో ఒక అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ మోడల్ రాజధాని నిర్మాణానికయితే దాదాపు రూ.1.5 లక్షల కోట్లు, సాధారణ రాజధాని నిర్మాణానికయితే రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని తాము అంచనా వేసినట్లు తెలిపారు. రాగల వంద సం.లలో రాజధాని ప్రాంతంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని రాజధానిని నిర్మించాలనుకొంటున్నామని, అందుకు లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నందున ఒక బృందాన్ని త్వరలోనే సింగపూరు పంపబోతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మించే ప్రాంతం, దాని పరిధి, దాని రూపురేఖలు, అందుకు అయ్యే ఖర్చు వగైరా వివరాలన్నీ తెలియడానికి కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చని ఆయన తెలిపారు. అంటే మరో ఆరునెలల వరకు రాజధాని నిర్మాణం పనులు మొదలుకాక పోవచ్చని సూచన ప్రాయంగా చెప్పినట్లే భావించవచ్చును. రాజధాని నిర్మాణం కోసం రూ.90 నుండి రూ.1.50 లక్షల కోట్లు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసారు గనుక అందులో ఐదో లేక పదో వంతయినా సొమ్ము కేంద్రం విడుదల చేయనిదే పనులు మొదలుపెట్టడం మంచిదికాదనే ఉద్దేశ్యంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ఇందులో రాష్ట్రప్రభుత్వం తప్పు, జాప్యం లేదు గనుక, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఒక స్పష్టమయిన ప్రకటన చేస్తే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/ap-45-35940.html