నేను చాలా రిచ్.. అయినా జైలు కూడే తిన్నా.. అంబటి కామెంట్స్ వైరల్
Publish Date:Feb 18, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత భాషలో దూషణలకు పాల్పడిన కేసు సహా మరో రెండు కేసులలో జైలు పాలైన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన అంబటి కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బుధవారం (ఫిబ్రవరి 18) విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు. అయినా తాను సద్దుకుని ఆ తిండే తిన్నానని చెప్పారు. అక్కడితో ఆగకుండా, తాను చాలా చాలా ధనవంతుడినని చెప్పుకున్నారు. తనకు జైలు భోజనం ఇసుమంతైనా నచ్చలేదనీ, కానీ ఆ విషయంలో తాను చేయగిగిందేమీ లేకపోవడంతో ఆ భోజనమే తిన్నానని చెప్పారు. తనకు జైలు భోజనం నచ్చలేదని చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, తాను ధనవంతుడిననీ, అటువంటి తనకు జైలు కూడు తినిపించారనీ అనడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 18 రోజుల పాటు జైలు భోజనం చేసినా అంబటి రాంబాబులో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదనీ, కొంచం కూడా చిక్కలేదనీ.. ఆయనీ ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయాలంటూ ఇంట్లో కూడా జైలు భోజనం చేసే అవకాశాలను పరిశీలించాలంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ambati-rambabu-pecular-comments-25-214319.html





