అంబటి వైసీపీని అడ్డంగా బుక్ చేసేశారుగా?
Publish Date:Jun 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుది ఒక ప్రత్యేక శైలి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని అయన చేసే విమర్శలు తరచుగా బూమరాంగ్ అవుతూ ఉంటాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటి కంటే.. అధికారంలో నేని సమయంలోనే అప్రమత్తంగా ఉండాలంటారు పరిశీలకులు. అధికార పక్షంపై చేసే విమర్శలకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపనలు చేస్తే.. ప్రజలలో ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబే చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని ఆయన స్వయంగా ప్రకటించేశారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ఫోటో తీవ్ర వివాదానికి కారణమైంది. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధించిన ఒక ఫోటోను ఆధారం చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే.. ఆ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటో అని తేలడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఫేక్ ఫోటో వ్యవహారంపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ పార్టీ చేసిన పెద్ద తప్పును బహిరంగంగానే అంగీకరించేశారు. ఎలాంటి ప్రాథమిక నిర్ధారణ లేకుండా.. కేవలం సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫేక్ ఫోటోను నమ్మి కూటమి ప్రభుత్వంపై దాడికి దిగడం వల్లే వైసీపీ బుక్కయిందని అంబటి అన్నారు. నిజం కాని విషయాలపై స్పందించి నవ్వులపాలు కావడం కంటే, మౌనంగా ఉండటమే మేలన్నట్లుగా ఆయన మాట్లాడారు. విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు.అక్కడితో ఆగకుండా సాయి కృష్ణ ఫోటోను ప్రదర్శించి.. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు ప్రదర్శించిన ఫొటోలను ఆధారం చేసుకుని జగన్ సొంత మీడియా కూడా రెచ్చిపోయి వార్తలను ప్రచురించింది. ప్రసారం చేసింది. అయితే అంబటి రాంబాబు చూపిన ఫొటో సాయికృష్ణది కాదు, నవీన్ రెడ్డిదని తేలింది. ఈ విషయాన్ని స్వయానా నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ నవీన్ రెడ్డి ఎవరన్న ఆరా మొదలైంది. ఆ ఆరాలో నవీన్ రెడ్డి, సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులని తేలింది. వీరిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారనీ రాణి తోట.. కృష్ణలంక వాసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తాను అడ్డంగా బుక్కవ్వడమే కాకుండా, వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/ambati--landed-ycp-in--trouble-25-223473.html




