ఎనిమిది పదుల వయస్సులో రైతు రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం.. చంద్రబాబు
Publish Date:Mar 13, 2026
Advertisement
ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తూ ఆదర్శంగా నిలిచిన రైతు రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. ప్రకృతి సేద్యం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయన్న సీఎం చంద్రబాబు.. రైతు రోశయ్య వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందనీ, రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో సాగు చేస్తే పంటల నాణ్యత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందనీ అన్నారు. ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందన్న సీఎం చంద్రబాబు రోశయ్య లాంటి రైతులు మరింత మంది ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని ఆకాంక్షించారు. భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన ఎనభై ఏళ్ల రోశయ్య.. తనకున్న 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ, నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్నారనీ, ఆయన విజయగాధ స్ఫూర్తిదాయకమన్నారు. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం. ఆయనకు అభినందనలని చంద్రబాబు పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/-success-story-of-farmer-rosayya-36-215424.html





