కడప రెడ్డెమ్మ కుర్చీలాట
Publish Date:Aug 16, 2025
Advertisement
రెడ్డప్పగారి మాధవి రెడ్డి అంటే అదో బ్రాండింగ్ అన్నట్టు.. స్టేజి మీద చేరి కన్ను గీటినా.. తనకు కుర్చీ వేయలేదు అంటూ మైకు గిరాటేసినా.. ఆమెకే చెల్లిందని అంటారు. ఆమె మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి కోడలు, కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి సతీమణి. అంతే కాదు ఎంఏ వరకూ చదివిన విద్యావంతురాలు కూడా. కానీ ఆమె కుర్చీ ప్రొటోకాల్ విషయంలో మాత్రం ఒక్కసారిగా చిన్నపిల్లలా మారిపోతారని చెబుతారు. అదేదో సినిమాలో ఒక కేరెక్టర్.. నాకు బర్త్ డే కేక్ పెట్టలేదు నున్వు! అంటూ గొడవ చేసే పాత్రలా ఉంటుందామె తీరు. మొన్న 2024లో మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో కూడా కుర్చీ వేయలేదంటూ నానా రభస చేశారు రెడ్డెప్పగారి మాధవీరెడ్డి. ఇక్కడ వైసీపీ లీడర్లు తనకు వ్యతిరేకంగా కుర్చీలాట మొదలు పెట్టారంటూ ధూం ధాం అన్నారు. ఒక ఎమ్మెల్యే అయిన తనకంటూ వేదికపై కుర్చీ వేయలేదంటూ ఆ సమావేశమంతా నిలబడి నిరసన చేశారు. ఇప్పుడు చూస్తే.. కడప పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేదికపై తనకు కుర్చీ వేయలేదంటూ తీవ్రంగా మండి పడ్డారు. తాను ఎమ్మెల్యే అయినా ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ముందు వరుసలో కూర్చీ వేసి.. ఎమ్మెల్యే అయినా తనను పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం పంద్రాగస్టు వంటి కార్యక్రమాలకు అలాంటి ప్రోటోకాల్ ఉండదు, ప్లీజ్ అర్ధం చేసుకోండి అంటూ అధికారులు ఎంత నచ్చ చెప్పినా, కడప రెడ్డెమ్మ మాత్రం కుర్చీ మే సవాల్ అంటూ వారిని అట్టుడికించారు. అదేంటో గత కొంత కాలంగా ఈ రెడ్డెమ్మకు కుర్చీతో పెద్ద కీచులాటే వచ్చినట్టుంది. ఆమె మనసులో ఈ విషయం ఒక ఆందోళనతో కూడిన- కుట్రలో భాగమైన- ఒక వ్యవహారంగా గూడుకట్టుకున్నట్టు కనిపిస్తోంది. కడప మున్సిపల్ సమావేశంలో మొదలైన ఈ కుర్చీ కాన్ స్పిరసీ థియరీ.. ఎక్కడికెళ్లినా ఆమెను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి నాకంటూ ఒక కుర్చీ వేసి.. దానికంటూ ఒక ట్యాగ్ తగిలించి.. ఆ నీట్ వైట్ చైర్ ని అన్ని కుర్చీల మధ్యలో వేసి.. అలా ఖాళీగా పెట్టి ఉంచితేనే ఆమె సంతృప్తి పడతారనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకండీ మేడంగారూ కుర్చీ అంటూ మీరంత ఫైర్ అయిపోతున్నారని.. ఆమె అంతరంగిక వర్గాల వారు వారిస్తున్నట్టుగా అడిగితే.. మనం ఇంత చేసి గెలిచింది ఈ కుర్చీ కోసమేగా.. నీకేం తెలీదు ఊర్కో అంటున్నారట కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి. ఇంట్లో కూడా ఆమె కూర్చునే కుర్చీలో భర్త, పిల్లలు, ఇతర బంధుమిత్రులు ఎవ్వరూ కూర్చోరట. కారణం అది ఎమ్మెల్యేగారి కుర్చీ. మనం ఆ సీట్లో కూర్చోవద్దని వారికి వారు ఫిక్సయ్యారట. అది కూడా మున్సిపల్ సమావేశం తర్వాత ఈ జ్ఞానోదయం అయ్యి.. అలా ఒక ఆచారం పాటిస్తున్నారట. ఎందుకంటే బయట ఆమెకంటూ కనీస గౌరవంతో కూడిన కుర్చీ వేయడం లేదు. దీంతో ఆమెకు ముక్కు మీద కోపం వచ్చేస్తోంది. ఇంట్లో కూడా అలాంటి సీన్ చూడ్డం ఇష్టం లేక ఇంట్లో వారు అలాంటి అలవాటు ఒకటి చేసుకున్నారట. అక్కడ మొదలైన ఈ కుర్చీలాట ఆమె మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయి పోయిందని.. ఇంటా బయటా ఆమె కోసం ప్రత్యేకంగా వేసిన కుర్చీ కనిపించకుంటే ఒంటికాలిపై లేస్తారన్న టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది. అయితే కొన్ని కొన్ని సమయా సమయాల్లో మాత్రమే కుర్చీ ప్రోటోకాల్ ఉంటుంది. అంతేగానీ అన్ని చోట్లా కుర్చీ- కుర్చీ- కుర్చీ అంటూ కుర్చీనామజపం చేయరాదని.. కాస్త ఎవరైనా చెప్పండయ్యా ఆమెకు అంటున్నారట అధికారులు. మరి చూడాలి.. మేడంగారి మ్యూజికల్ చైర్ గేమ్ ఇంకెంత కాలం నడుస్తుందో !
http://www.teluguone.com/news/content/-kadapa-reddemma-chair-dance-39-204345.html





