ఆల్ ఈజ్ నాట్ వెల్.. సీజేఐ ఆగ్రహం సీఎస్ పైనేనా?
Publish Date:Apr 30, 2022
Advertisement
తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల వర్షం కురిపించి నెల రోజులు గడిచిందో లేదో.. తెలంగాణ సీఎస్ పనితీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన సీజేఐ ఎన్వీ రమణ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్ సహకారం కారణమన్నారు. అలాగే న్యాయాధికారుల పోస్టుల మంజూరులో ఆయన చూపిన చొరవను బహుదా ప్రశంసించారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం హస్తినలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో తెలంగాణ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హైకోర్టు సీజేలు తీసుకున్న నిర్ణయాల అమలులో సీఎస్ అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికీ, సీఎం ఈ సదస్సుకు హాజరు కాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు కు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. చీటికీ మాటికీ హస్తిన బయలుదేరే సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టడానికి కారణమేమిటన్న విషయంపై సర్వత్రా ఆసక్కి నెలకొంది. రాజకీయ కారణాల వల్లనే కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారని అంతా భావిస్తున్నారు. అయితే సీజేఐ తెలంగాణ సీఎస్ తీరుపై చేసిన వ్యాఖ్యలతో కేవలం రాజకీయ కారణాలే కాకుండా ఇతరేతర కారణాలు కూడా సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు గైర్హాజర్ కావడానికి కారణమై ఉంటుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఫేస్ చేయడం ఇష్టం లేదన్న ఒక్క కారణంతో ఇంత కీలకమైన సదస్సుకు సీఎం డుమ్మా కొట్టారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్న
ప్పటికీ అవి అమలు కాకపోవడం.. దానిపై సీజేఐకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిని దాటవేయడానికే సీఎం ఈ సదస్సుకు గైర్హజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ కోర్టుల్లో దయనీయ పరిస్థితులపై రమణ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ డుమ్మాకు ఇది కూడా ఒక కారణమన్న భావన వ్యక్తం అవుతోంది. ఆర్భాటంగా నిర్ణయాలు ప్రకటించడం, ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం కేసీఆర్ శైలి.. ఆ కారణంగానే కోర్టులలో సదుపాయాలు, సౌకర్యాలపై కేసీఆర్ నిర్ణయాలు అమలు కాకపోవడంపై సమాధానం ఇచ్చుకునే పరిస్థితిని తప్పించుకోవడానికి కూడా కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు గైర్హాజర్ కావడానికి ఒక కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/-cm-absent-cji-furious-on-telangana-cs-25-135282.html





