ఫామ్‌-7 దరఖాస్తులు ఇచ్చింది మేమే.. తప్పేంటి?

 

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 దరఖాస్తులు వేలు, లక్షల్లో వస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఈసీ కూడా అంగీకరించింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు దీని వెనుక వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం హస్తం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘ఫామ్‌-7లు సమర్పిస్తున్నది మేమే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మంగళవారం నెల్లూరులో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దొంగ ఓట్లు తొలగించాలని కోరితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ‘చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు చేర్చించారు. వాటిని తొలగించాలని ఫామ్‌-7 ద్వారా కోరాం’ అని తెలిపారు. అదే సమయంలో.. వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్న వారి ఓట్లను టీడీపీ తొలగించే కుట్ర చేస్తోందని అన్నారు. ‘చంద్రబాబు అన్యాయం చేస్తున్నా తప్పు కాదా? దొంగ ఓట్లు తొలగించాలని మేము అడిగితే తప్పా? దొంగ ఓట్ల తొలగింపులో రాజీ పడొద్దు’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మా ఓట్లు తీసేస్తున్నారు’ అని ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసిన జగన్‌.. తామే ఇతరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చినట్లు అంగీకరించడం టీడీపీకి అస్త్రంగా మారే అవకాశముంది. మరి ఎన్నికల వేళ ఈ ఓట్ల తొలగింపుల యవ్వారం ఇంకెంత ముదురుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu