తెనాలిలో జ‌గ‌న్‌కు నిరసన సేగ.. ద‌ళిత‌, ప్ర‌జా సంఘాలు నిర‌స‌న

 

 

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్త‌త నెల‌కొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని ద‌ళిత‌, ప్ర‌జా సంఘాలు నిర‌స‌న తెలిపాయి. ఐతా న‌గ‌ర్‌లో రౌడీ షీట‌ర్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి రావ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. జ‌గ‌న్ కాన్వాయ్ వ‌స్తున్న స‌మ‌యంలో న‌ల్లబెలూన్లతో ద‌ళిత సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆయా సంఘాల నేత‌లు నినాదాలు చేశారు.  జగన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాలు నిర్వహించిన రాస్తారోకో, మానవహారం జగన్ అహంకారానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించాయి. "రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నారా? నూతక్కి కిరణ్ హత్యపై మీకు పరామర్శ ఎందుకు లేదు?" అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా, నూతక్కి కిరణ్ మృతదేహం లభ్యం కాక, అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా, జగన్ రెడ్డికి వారి ఆవేదన కనిపించలేదా? ఒక యువకుడి జీవితం అంధకారంలోకి నెట్టబడినప్పుడు, ఆ కుటుంబానికి న్యాయం జరగనప్పుడు, మాజీ ముఖ్యమంత్రిగా మీరు రౌడీ షీటర్లను పరామర్శించడం దారుణం కాదా? ప్రశ్నించారు. 

 తెనాలిలో సామాన్యుల‌పై దాడులు, మ‌హిళ‌ల‌పై వేధింపులు, గంజాయి విక్ర‌యాల‌కు పాల్ప‌డిన ముఠా స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ రావ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా, తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాళ‌ తెనాలిలో పర్యటించ‌డం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యువకులు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలుస్తోంది. గంజాయి కలిగి ఉన్నారనే అనుమానంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌తో ఈ యువకులకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో విషయం వెలుగులోకి వచ్చింది.