అమరావతి కోసం 40వేల ఎకరాలు!?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్‌లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీయేఅథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో.. త్వరలోనే మరో 40వేల ఎకరాల భూమిని సమీకరించ బోతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో... అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతోంది.

అలాగే... రెండు వేల ఐదువందల ఎకరాల్లో స్మార్ట్  ఇండస్ట్రీని, మరో పాతిక వందల ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించాలని  ఏపీ సర్కార్ భావిస్తోంది.  వీటి కోసం దాదాపు 10 వేల ఎకరాలు అవసరం అవుతాయి. ఇందు కోసం భూమిని  ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలా?  లేదా అక్విజేషన్‌ ద్వారా తీసుకోవాలా అన్న విషయంపై  తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.  గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత.భూ సేకరణా లేక సమీకరణా అన్న విషయంపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రైతులు మాత్రం   ల్యాండ్ పూలింగ్‌కే  మొగ్గుచూపుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు. పూలింగ్‌ అయితే.. 40వేల ఎకరాలు సేకరించాలని... అప్పుడే 10వేల ఎకరాలు మిగుతాయన్నారు. అక్విజేషన్‌ అయితే.. 10వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే.. రైతులకు కూడా మేలు జరగాలి కనుక.. వీలైనంత  వరకు ల్యాండ్‌ పూలింగ్‌నే ప్రిఫర్‌ చేస్తామన్నారు మంత్రి నారాయణ.  

ఇక... అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో 3వేల 673 కోట్ల వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను సీఆర్డీయే ఖరారు చేసింది.   882కోట్లతో నిర్మించే జీఏడీ టవర్ నిర్మాణాన్ని ఎన్సీసీ, 14 వందల 87 కోట్లతో నిర్మించే  హెచ్ఓడీ 1, 2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ అండట్ పల్లంజీ, 13 వందల 4 కోట్లతో నిర్మించే హెచ్ఓడీ 3, 4 టవర్లను ఎల్‌ అండ్‌ టీ దక్కించుకున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభంకానున్నాయి.  2014-19 మధ్య  రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణ పనులు జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 
మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్  ప్రాంతంలో అన్ని నిర్మాణాలను పూర్తిచేయాలనే లక్ష్యంతో  ప్రభుత్వం ఉందని చెప్పారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై కూడా మరో 15 రోజుల్లో క్లారిటీ వస్తుందని.. భూసేకరణ తర్వాత... రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెడతాయని చెప్పారు.