జగన్ కు బిగ్ షాక్.. అమరావతికి వైసీపీ ఎమ్మెల్యే మద్దతు..

మూడు రాజధానుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాకిచ్చారు. రాజధానులపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైసీపీ చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. 

‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులను ఎమ్మెల్యే కోటంరెడ్డి  కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని.. తప్పకుండా సహకరిస్తానన్నారు. ‘జై అమరావతి’ అనాలని రైతులు కోరగా శ్రీధర్‌రెడ్డి సున్నితంగా వారించారు. ఆ మాట అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులున్నాయని వ్యాఖ్యానించారు.  అమరావతి రైతులను వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉంటారనే పేరున్న శ్రీధర్ రెడ్డి.. అమరావతికి సంఘీభావం తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. శ్రీధర్ రెడ్డి బాటలోనే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, కాని ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారనే టాక్ వస్తోంది.