ఏపీ గవర్నర్ కు మళ్లీ సీరియస్.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు
posted on Nov 29, 2021 7:25AM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోమారు అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు గతరాత్రి మళ్లీ సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం గవర్నర్ కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది.
జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆదివారం రాత్రి మరోమారు గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో రాజ్భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి. గవర్నర్కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.