ఏది భావ ప్రకటనా స్వేచ్ఛ కొమ్మినేనిగారూ!
posted on Jun 14, 2025 12:23PM
.webp)
కృష్ణుడిలా ఛాన్స్ మిస్ చేసుకుని
చరిత్రలో దుర్యోధనుడిలా మిగిలారుగా!
చాలా మంది తెచ్చే పోలిక ఏంటంటే భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో ఆనాడు రఘురామకృష్ణం రాజు, నేడు కొమ్మినేని అవలీలగా బెయిల్ తెచ్చుకోవడం. ఆయనకూ ఈయనకూ తేడా ఇదేనంటారు. ఆనాడు రఘురామ వైసీపీలోనే ఒక రెబల్ ఎంపీ గా ఉంటూ, అధినేత జగన్ పై తరచూ విరుచుకుపడేవారు. ఇద్దరి మధ్య ఎక్కడ ఏ ఇగో క్లాష్ వచ్చిందో తెలీదుగానీ మొత్తానికి ఆనాడు రఘురామ భారీ ఎత్తున వైసీపీ నావ మునిగిపోయేలా చేశారు. తర్వాత ఆయన తెలివిగా ఆ చిల్లుపడ్డ నావ నుంచి బయటకొచ్చారు. కూటమిలో చేరారు. ఇవాళ ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో పొలిటికల్ కెరీర్ సెట్ చేసుకున్నారు.
ఇదంతా ఇలా ఉంచితే కొమ్మినేనికీ ట్రిపుల్ ఆర్ కి ఉన్న పోలిక విషయానికి వస్తే.. ఇద్దరూ ఈ స్వేచ్చ ద్వారా బయట పడ్డవారే. అయితే అక్కడ రఘురామ వ్యక్తిపై చేసిన దాడికీ, ఇక్కడ కొమ్మినేని వ్యవస్థపై జరిగిన దాడికి కారకులు. అలాగంటే ఆ మాటలు కూడా తాను అనలేదంటారు కొమ్మినేని. ఈ విషయంలో ఆయన్ను కొట్టిపడేయలేం. నిజానికి ఆయనేమీ ఈ మాట అనలేదు. కానీ తన డిబేట్ లో ఒక ఎనలిస్టు ఈ కామెంట్లు చేస్తుంటే.. దాన్ని ఆయన రక్షణార్ధం ఆపమని అన్నారేగానీ.. అమరావతి మహిళల మాన రక్షణార్ధం అనలేదు. ఇక్కడే ఆయన కృష్ణుడు కాదగిన అవకాశం మిస్ చేసుకున్నారని అంటారు.
ఇదే మహా భారత యుద్ధానికి లీడ్ పాయింట్ అయిన.. ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుశ్శాసనుడి పాత్ర.. కృష్ణంరాజు తీసుకున్నారు. అమరావతి మహిళలంతా కలసి ద్రౌపది రూపంలోకి మారిపోగా.. ఇక్కడ ఒక దుర్యోధనుడిలా కొమ్మినేని వ్యవహరించినట్టు కనిపించింది. ఇక్కడ దుశ్శాసనుడ్ని కాపాడ్డమెలా అన్న కోణంలో దుర్యోధనడిలా కొమ్మినేని థింక్ చేశారేగానీ.. శ్రీకృష్ణ పరమాత్మలా వ్యవహరించలేక పోయారని అంచనా వేస్తారు.
బేసిగ్గా ఇలా చేయడం ఆయనకు కూడా చేటు తెచ్చేదే. ఎందుకంటే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వార్తా సంస్థ కావచ్చు. దాని వెనకున్న పార్టీ కావచ్చు.. అమరావతికి పూర్తి వ్యతిరేకం. ఒక వేళ కొమ్మినేని ఆ సమయంలో అమరావతి వైపున ఉంటే ఆయనకున్న ఉద్యోగం సద్యోగం మొత్తం ఊడిపోయి ఉండేవి. దీంతో ఆయనెంతో తెలివిగా దుశ్శాసుడి (ఎనలిస్టు కృష్ణంరాజు) వైపే నిలిచారు. దీంతో ఆయన అమరావతి మహిళాలోకం దృష్టిలో దుర్యోధనుడిగా పేరు సాధించారే గానీ తనకు అందివచ్చిన కృష్ణావతారం దాల్చడానికి ఛాన్స్ తీస్కోలేక పోయారు కొమ్మినేని.
అంటే తన స్వార్ధం కోసం అమరావతి మహిళలను ఇక్కడ కొమ్మినేని ఫణంగా పెట్టినట్టే లెక్క. అందుకే ఆయనకు సుప్రీం బెయిల్ ఇచ్చినా.. అమరావతి మహిళల దృష్టిలో ఆయన జీవితకాలం దోషిగా నిలవక తప్పదన్న విశ్లేషణలు అందుతున్నాయ్. ఏమంటారు?