డేటా చోరీపై సిట్ విచారణ.. అరిచి గీపెట్టినా పట్టించుకోలేదు

 

తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన ఐటీ గ్రిడ్ డేటా చోరీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. 'సొంత రాష్ట్రంలో అన్యాయం జరిగితే సైలెంట్ గా ఉంటారు. పొరుగు రాష్ట్రంలో అన్యాయం జరిగితే సిట్ అంటారు' అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు.

'ఐటీ గ్రిడ్ వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉంది. ఐటి గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణపై తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారు. పొరుగురాష్ట్రానికి సంబంధించిన ఈఅంశానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణజరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆరెఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.' అని విమర్శించారు.

'పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను వేస్తారు. అదే అన్యాయం ఇక్కడ జరిగితే సిట్(కూర్చోండి) అని ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తారు. కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్ధ అంటే ఇలాగే ఉంటుందేమో?' అని ఎద్దేవా చేసారు. 'ఇక్కడ గమనించాల్సిన మరో ప్రధాన విషయం ఏమిటంటే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, వైసీపీ అధినేత జగన్ గవర్నర్ ను కలిసి.. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన కొన్ని నిమిషాలలోపే ఈ వివాదానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందన్న వాదనను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే  కేసీఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ ముసుగు తొలగిపోయి, బీజేపీ కోసమని తెలిసిపోతుంది.' అని ట్వీట్ చేసారు.